తెలుగు దేశం పార్టీ లో మొదటి నుంచీ సర్వే లని నమ్ముకునే పరిస్థితి ఎప్పుడూ లేదు .. చంద్రబాబు ఈ దఫా ముఖ్యమంత్రి అయిన తరవాత మోడీ ని చూసో మరెవరి సలహా తీసుకునో ఈ కొత్త కాన్సెప్ట్ ని మొదలు పెట్టారు ఆయనే. నాయకుల పనితీరు కి సంబంధించి లెక్కలు తెప్పించుకోవడం వారి ప్రవర్తన, వారి పనితీరు ఎలా ఉంది అనేది బేరీజు వేసుకోవడం దాని నుంచి వారి భవిష్యత్తు మీద డెసిషన్ లు తీసుకోవడం.
ఇలాంటి సర్వే లు జరగడం మొదలైన తరవాత మాత్రం ఎమ్మెల్యే లు మంత్రులు కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పగలిగిన మాట. అయితే ఇప్పుడు ఈ బేరీజు వేసే అంశాలలో చంద్రబాబు ఆయన మనుషులు ఒక సరికొత్త అంశాన్ని జోడించారు అని తెలుస్తోంది.
అదే ' కార్యకర్తలు ' అనే విషయం, ఏ ఆపార్టీకి అయినా వారే మూల స్థంబాలు కాబట్టి వారి సమస్యల కి మంత్రులు, నేతలు, ఎమ్మెల్యే లు, ఎంపీ లూ ఎలా స్పందిస్తున్నారు అనేది ఇప్పుడు బేరీజు వేస్తున్న అంశం అట. ఎలా అంటే, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలపై తక్షణం స్పందిస్తున్నారా లేదా..? కార్యకర్తల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏ మేరకు పనిచేస్తున్నారు..?
ఏయే నాయకులు పార్టీ కార్యకర్తల్ని ఎంత మేర సంతృప్తిపరుస్తున్నారు అనే అంశంపై పార్టీ అధినేత ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. పదవులు వచ్చిన దగ్గర నుంచీ నేటి వరకూ కార్యకర్తల కోసం ఏయే నేతలు ఎంతగా కృషి చేస్తున్నారు అనేది ఆరా తీస్తున్నారట!