భారత దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన తాజ్ మహల్ పై మొన్నటి వరకు ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి. హర్యానా క్రీడల మంత్రి అనిల్ విజ్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. తాజ్ మహల్ ఓ అందమైన శ్మశానం అని అనిల్ విజ్ చేసిన కామెంట్స్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఆ ప్రేమ చిహ్నం ఓ అందమైన శ్మశాన వాటిక అంటూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా ఆదిత్యానాథ్ ఆరు నెలల పాలన పూర్తి అయిన సందర్భంలో యూపీ ప్రభుత్వం ఓ బుక్లెట్ విడుదల చేయగా.. అందులో పర్యాటక ప్రాంత జాబితా నుంచి తాజ్ మహల్ను తొలగించారు.దీనిపై తీవ్ర విమర్శలు వినిపించాయి.
తాజాగా మరోసారి తాజ్ మహల్ వార్తల్లోకి ఎక్కింది. భారత్ నుండి రోజుకి 40 వేల మంది పర్యాటకుల్ని మాత్రమే అనుమతిస్తారని, పిల్లలకు 15 సంవత్సరాల వయస్సు వరకు ఎటువంటి టికెట్ అవసరం లేదని పురావస్తు శాఖ అధికారులు, పోలీసులు, పారామిలటరీ అధికారులు సంయుక్తంగా ఆదేశాల్ని జారీ చేశారు. తాజ్ మహల్ పరిరక్షణపై పారా మిలటరీ, ఏఎస్ఐ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర పర్యాటక శాఖ చర్చలు జరిపింది.
ఈ సమావేశం తర్వాత కేంద్ర పర్యాటక శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకొంది. విదేశీ టూరిస్టులకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. ముంతాజ్ సమాధిని సందర్శించేందుకు రూ.100 చెల్లించి టిక్కెట్టును కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు.పర్యావరణ పరిరక్షణకు, హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి మహేష్ శర్మ తెలిపారు.