వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 51వ రోజుకు చేరుకుంది. అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం జమ్మివారిపల్లె వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఏడువందల కిలోమీటర్ల మైలురాయిని దాటింది.
ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ సమీపంలో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించి, మొక్కను నాటారు. ప్రతి వంద కిలోమీటర్లకు ఒక మొక్కను నాటుతూ ఆయన ముందుకు సాగుతున్నారు. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా జమ్మిలవారిపల్లి నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. జమ్మిలవారిపల్లి శివారు నుంచి ప్రారంభమై చింతపర్తి, పాతకోటపల్లి, బీదవారిపల్లి, గండబోయనపల్లి, డెకలకొండ మీదుగా కలికిర వరకు కొనసాగుతుంది.
పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ జనంతో మమేకం కానున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రకు వైసీపీ ఎమ్మెల్యే రోజా జతకలిశారు. చింతపర్తిలో జగన్ నుదుటన తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను రోజా తన ఫేస్ బుక్ అకౌంట్ లో అప్ లోడ్ చేశారు.