పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని భార్యలకు నరకం చూపించే మృగాళ్లను ఇన్నాళ్లూ చూశాం. కానీ ప్రియుడి మోజులో పడి మొగుడి ప్రాణాలు తీస్తున్న భార్యలు ఈ మధ్య కాలంలో పెరిగారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ వరుస సంఘటనలు విస్తుగొలుపుతున్నాయి. సున్నితమైన మహిళలు ఇంత ఘోరంగా పథకాలు రచించి మరీ హత్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Image result for vidya killed husband

మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. దంపతుల్లో ఎవరో ఒకరు వేస్తున్న తప్పటడుగులు.. పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతోంది. వివాహేతర సంబంధాలు ఎన్నో కాపురాలను కూల్చేస్తున్నాయి. క్షణిక సుఖాల కోసం భర్తలను చంపిస్తున్న... లేదా చంపేస్తున్న భార్యలు వెలుగులోకి వస్తున్నారు. మొన్న స్వాతి, నిన్న అరుణ, నేడు జ్యోతి, విద్య.. పేర్లు ఏవైనా వారు చేస్తున్న దారుణాలు మాత్రం ఒక్కటే. తమ  సంబంధాలకు అడ్డొస్తున్న భర్తలను పథకం రచించి మరీ చంపేస్తున్నారు. సంసారంలో సమస్యలు.. ఇష్టం లేని పెళ్లి.. పెళ్లయినా ప్రియుడిపై తగ్గని మోజు.. కారణాలు ఏవైతేనేం.. కొంతమంది భార్యలు కర్కశంగా మారుతున్నారు. భర్తలను దారుణంగా హత్య చేస్తున్నారు. వారి సంఖ్య ఇప్పుడు పెరుగుతూ వస్తోంది.

Image result for swathi killed husband

కొన్నేళ్లుగా ఇలాంటి సంఘటనలు అడపాదడపా జరుగుతున్నా.. గత నెలలో నాగర్ కర్నూలులో జరిగిన స్వాతి ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ఇటీవల జరుగుతున్న ఈ దుర్ఘటనలు క్షణికావేశంలో జరుగుతున్నవి కావు. వాళ్లు వేస్తున్న పథకాలకు పోలీసు వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. గత డిసెంబర్ లో జరిగిన సుధాకర్ రెడ్డి హత్యలో భార్య స్వాతి వేసిన ప్రణాళిక “ఎవడు” సినిమాను తలపించింది. భర్తను హత్య చేసిన ఆమె.. ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి భర్త స్థానంలోకి తీసుకు రావాలని భావించింది. ఈ పథకం ఆధార్ కార్డు పుణ్యమా అని బయటపడింది. కానీ స్వాతి ఆలోచనా తీరు అందరినీ నివ్వెర పరచింది.

Image result for aruna killed husband

అదే నెలలో కడప జిల్లాలోని చవనవారిపల్లెలో జరిగిన ఘోరం కూడా అలాంటిదే. పెళ్లికి ముందే సుభాష్ ను ప్రేమించిన అరుణ.. తప్పనిసరి పరిస్థితుల్లో శివని పెళ్లి చేసుకుంది. అయినా ప్రియుడితో సంబంధం కొనసాగించింది. భార్య వ్యవహారం తెలిసిన శివ పలుమార్లు హెచ్చరించాడు. చివరగా అడ్డుగా ఉన్న తన భర్తను తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు పక్కా ప్రణాళిక రచించిన అరుణ.. ప్రియుడు, అతడి స్నేహితులతో కలిపి భర్తను హత్య చేసింది.

Image result for jyothi killed husband

తర్వాత కూడా అలాంటివి ఒకటి రెండు ఘటనలు జరిగాయి. నల్గొండ జిల్లా ఏపూరుతాండాలో జరిగింది కూడా అలాంటి కథే. సోమ అనే వ్యక్తి హత్య కేసులో భార్యే నిందితురాలు. ఆమెతో పాటు ప్రియుడు కటకటాల వెనక్కి వెళ్లాడు. ఇప్పుడు హైదరాబాద్ జ్యోతి కథా అంతే. కార్పెంటర్ గా పనిచేస్తున్న భర్త నాగరాజుని కడతేర్చింది. ఈ కథలోనూ వివాహేతర సంబంధమే భర్త చావుకు కారణం. కార్తీక్ తో తనకు ఉన్న సంబంధం భర్తకు తెలియడంతో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించింది. ప్రియుడు కార్తీక్.. అతని స్నేహితుల సహాయంతో కట్టుకున్న మొగుడిని అనంత లోకాలకు పంపించేసింది.

Related image

ఇక తాజాగా గుంటూరు జిల్లాలో భర్తను చంపిన కసాయి భార్య శ్రీవిద్య కేసు ఆలస్యంగా వెలుగుచూసింది. బావ మీద మోజుతో భర్తను అత్యంత కిరాతకంగా చంపేసింది. బావ సాయంతో భర్తను కడతేర్చిన భార్య శ్రీవిద్య నిందితుడు వీరయ్యతో కలిసి ఈ దుర్మార్గానికి పాల్పడింది. ఆ తర్వాత పరారైంది.  దీంతో ఈ కేసులో సంబంధం ఉన్న  ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివాహేతర సంబంధాలెప్పుడూ హత్యలకో, మరో నేరాలకో దారి తీసి.. చివరికి జైలు పాలు చేస్తాయి. తాజాగా జ్యోతి ఉదంతం అదే స్పష్టం చేసింది. అయితే వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు సమాజంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: