ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో పథకాలు రచిస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ది చేస్తే..యువత ఉద్యోగవకాశాలు మెండుగా వస్తాయని ఆయన ఆశ. వినూత్న ఆలోచనలే పెట్టుబడిగా పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు మరో సరికొత్త ఐడియాతో ముందుకెళ్తున్నారు. ఏపీలో ఇన్నోవేషన్ సొసైటీ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ దిశగా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ లిటరసీని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నది చంద్రబాబు ఆలోచన. కేవలం నెలరోజుల్లోనే ఈ ఏపీ ఇన్నవేషన్ సొసైటీని ఏర్పాటు చేయాలన్నది సీఎం పట్టుదల.
పరిపాలనలోజరిగే అవకతవకలకు టెక్నాలజీ వాడటమే సరైన పరిష్కారం.. ఈ విషయం సమర్థపాలకుడిగా చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఎక్కడ కొత్త టెక్నాలజీ వచ్చినా ఆయన ప్రోత్సహిస్తారు. టెక్నాలజీకి ప్రాధాన్యమిచ్చే అధికారులను భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు. అందుకే ఇకపై ప్రభత్వానికి వచ్చే పౌరుల అభ్యర్థనలన్నీ ఆన్ లైన్ ద్వారానే వచ్చేలా చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలు... ఫిర్యాదులు.. చివరకు ప్రజల స్పందన కూడా ఆన్ లైన్ ద్వారానే తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
ఇప్పుడు సోషల్ మీడియా ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది. ఫేస్ బుక్, వాట్సాప్ జనం జీవితాల్లో నిత్యకృత్యమయ్యాయి. వాటిని పరిపాలన కోసం.. సమస్యల పరిష్కారం కోసం కూడా వినియోగించుకునేలా చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందుకే ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న కొత్త టెక్నాలజీలను పరిశీలించడం.. అవి ఏపీకి ఎంతవరకూ పనికొస్తాయో చెక్ చేసుకోవడం.. అభివృద్ధి పరచడం.. ఇవీ ఇన్నోవేషన్ సొసైటీ ముందున్న లక్ష్యాలు.. జనంలో డిజిటల్ లిటరసీ పెంచినప్పుడే దీని వల్ల ప్రజలకు గరిష్ట లాభం చేకూరుతుంది.
సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను 24 గంటల్లోగా ఆన్ లైన్లో తాజా సమాచారంతో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమస్యలను ఆన్ లైన్ లో ఉంచడంలో, డిజిటలైజేషన్ లో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం తీసుకోవాలని కోరారు. పెన్షన్లు ఇచ్చినా, రేషను కార్డులిచ్చినా ఆన్ లైన్ లో ఉంచాలని సీఎం సూచించారు. గ్రీవెన్స్ సెల్ కు కూడా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో అవార్డులను ఇవ్వాలని సూచించారు.