పోలవరం లో ఎన్నో అవకతవకలు, అవినీతి జరుగుతుందని ఇప్పటికి చాలా మంది ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షం అయితే ఉదయాన లేసిన నుంచి పోలవరం గురించే చర్చ పెడతారు. అయితే ఎవరు ఎన్ని ఆరోపణలు చేసిన ఎంత మంది దుమ్మెత్తి పోసినా అధికార పార్టీ అయినటువంటి టీడిపి ఎటువంటి అవినీతి జరగడం లేదని ఒక్క ముక్క లో చెబుతుంటుంది.
పోలవరం ప్రాజెక్టు పనుల పేరుమీద జరుగుతున్న సాంకేతిక అవకతవకల గురించి మాత్రమే కాకుండా ప్రాజెక్టు పనుల్లో అవినీతి పర్వం గురించి కూడా సదరు రైతు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకే లేఖ రాసేయడం దాన్ని ప్రధాని కార్యాలయం ఏదో ఆషామాషీగా తీసుకుని బుట్టదాఖలు చేయకుండా సీరియస్ గా పరిగణించి ఈ లేఖలోని అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా.. ఈ లేఖలోని సంగతులేమిటో తేల్చవలసిందిగా రాష్ట్రప్రభుత్వానికి డైవర్ట్ చేయడంతో ఇప్పుడురాష్ట్ర ప్రభుత్వం ఓ రకంగా వణుకుతోందని సచివాలయంలో వినిపిస్తోంది.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా పురుషోత్తమ పట్నంలో కాలువలు తవ్వుతున్నారు. కాలువలైతే తవ్వుతున్నారు గానీ రైతులకు సరిగ్గా పరిహారం చెల్లించడంలో చాలా అన్యాయం చేశారంటూ సదరు రైతు ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. నిజానికి భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపుల వ్యవహారం అనేది రాష్ట్రం కేంద్రాల మధ్య నిధుల విషయంలో చాలా పెద్ద పేచీగా నడుస్తోంది. ప్రధాని కార్యాలయం ఆ లేఖ గురించి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి పంపింది. దాంతో అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా సరే అసలే కేంద్రంతో సంబంధాలు అంతంతమాత్రంగా ఉండడం.. ఇప్పుడు రాష్ట్రానికి అందించే సాయం గురించి కేంద్రం ఆలోచిస్తున్న సమయంలోఇలాంటి లేఖ వెళ్లడం వల్ల చాలా నష్టం జరుగుతుందని వారు భయపడుతున్నారు.