మొత్తం 70 స్థానాలున్న దిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 2015 ఎన్నికల్లో 66 సీట్లను గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి నిర్ణయంతో 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. అనర్హత వేటు పడిన వారిలో మంత్రి కైలాష్ గెహ్లాట్, శాసన సభ్యులు అల్కా లాంబా, ఆదర్శ్ శాస్త్రి, సంజీవ్ ఝా, రాజేశ్ గుప్తా, విజేందర్ గార్గ్, ప్రవీణ్ కుమార్, శరద్ కుమార్, మదన్లాల్ కుఫ్యా, శివ్ చరణ్ గోయల్, సరిత సింగ్, నరేశ్ యాదవ్, రాజేశ్ రిషి, అనిల్ కుమార్, సోమ్ దత్, అవతార్ సింగ్, సుఖ్వీర్ సింగ్ దాలా, మనోజ్ కుమార్, నితిన్ త్యాగి ఉన్నారు.
ఆప్ను చెందిన 21 మంది ఎమ్మెల్యేలు 2015, మార్చి 13 నుంచి సెప్టెంబరు 8, 2016 వరకు పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగడంతో లాభదాయక పదవులను చేపట్టారని, దీంతో వీరంతా అనర్హులవుతారని ఈసీ ప్రతిపాదనలను పంపించింది. మొత్తానికి ఎన్నికల కమిషన్ సిఫారసు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ తమ ఎమ్మెల్యేల వాదనను వినకుండానే ఇటువంటి చర్య తీసుకున్నారని ఆరోపించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్యోతి నిర్ణయం వెనుక బీజేపీ ఉందని ఆరోపించింది. రాష్ట్రపతి తమ ఎమ్మెల్యేల వాదనను వినాలని కోరింది. కానీ చివరికి రాష్ట్రపతి కూడా ఎన్నికల సంఘం సిఫారసులను ఆమోదించడంతో ఆప్ 20 మంది ఎమ్మెల్యేలను కోల్పోయింది.