తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన అందాల తార విజయశాంతి. తర్వాతి కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ అమితాబచ్చన్ గా పేరు తెచ్చుకుంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ..రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మొదల బీజేపీ పార్టీలో చేరిన విజయశాంతి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ‘తల్లి తెలంగాణ’ పార్టీ స్థాపించారు..ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి ఎంపీగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.
ఇక ఉద్యమ సమయంలో కేసీఆర్ తో ఎంతో సఖ్యతగా ఉంటూ వచ్చిన విజయశాంతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీరి మద్య విభేదాలు రావడంతో విడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి కొంత కాలంగా సైలెన్స్ గా ఉంటూ వస్తున్నారు. ఆ మద్య జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి..కానీ వాటిని ఖండించారు విజయశాంతి. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
జనసేనాని పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి సాక్షిగా రాజకీయ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ పవన్ కల్యాణ్ ను 'టూరిస్ట్' అంటూ కామెంట్ చేశారని.. ఆయన తెలంగాణ యాత్రకు ఇప్పుడు వీసా ఎలా జారీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడినవారిని పక్కనపెట్టి విమర్శించిన వారికే ప్రాధాన్య ఇస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ, జేఏసీ నేతలకు కూడా పవన్ కల్యాణ్ మాదిరిగా వీసాలిస్తే వారికి కనీసం తెలంగాణలో ఉన్నామన్న భావన కలుగుతుందని ఆమె సూచించారు. జేఏసీ నేతలను నిర్బంధించే తీరును చూస్తుంటే తెలంగాణ బిడ్డల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తెలుస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.