వచ్చే ఎన్నికల నాటికి అయినా సరే.. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటిస్తే గనుక.. భారతీయ జనతా పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అంటూ తెలుగుదేశం పార్టీ సాగించిన విష ప్రచారానికి ఇది విరుగుడు. ఆ హోదా అంటూ వస్తే రాష్ట్రానికి కొత్త వెలుగులు వస్తాయని నమ్ముతున్న ప్రజలకు జగన్ మాట ఆశాకిరణంలా కనిపించిందనడంలో సందేహం లేదు.
అయితే ఆ హోదాగురించిన, భాజపాతో మైత్రికి సంబంధించిన జగన్ మాట జనంలోకి వెళితే, వారు నమ్మితే, తమకు పుట్టగతులు ఉండవని తెదేపా భయపడుతోంది. జగన్ హోదా కోసం మైత్రికి సిద్ధపడుతున్నాడంటే తెదేపా హోదా కోసం మైత్రిని వదులుకోవచ్చు కదా అనే ప్రశ్న ప్రజల్లో పుడితే తమకు గడ్డుకాలమే అని వారు భయపడుతున్నారు. అందుకే జగన్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని, ఆ మాటలు హాస్యాస్పదం అని అంటున్నారు. ఎంపీలతో రాజీనామా చేయించలేదంటూ మోకాలికీ బోడిగుండుకీ ముడిపెడుతున్నారు.
దారుణం ఏంటంటే ప్రత్యేకహోదా అనే డిమాండ్ ను తెలుగుదేశం నాయకులు మంటగలిపేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతో ఇంతో ఆ మాటపట్టుకుని వేళ్లాడుతున్నారు. హోదా ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో భాజపాతో కలిసి పనిచేయడానికి సిద్ధం అన్న జగన్ మాటలు తెదేపాకు ఎంత జడుపు పుట్టించాయో తెలియదు కానీ వాటిని ప్రజలు నమ్మకుండా చేయడానికి ఆ పార్టీ ఆరాటపడిపోతున్నట్లుంది. వారి యెల్లో ప్రచారానికి దీటుగా జగన్ ఇంకాస్త ఘాటుగా హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకుంటే మేలు జరుగుతుందని ప్రజలంటున్నారు.