సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'పద్మావత్' సినిమా విడుదలయినా కూడా వివాదాలు మాత్రం సమసి పోవడం లేదు. పద్మావత్' సినిమా విడుదలయిన నేపథ్యంలో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగుతోన్న విషయం తెలిసిందే. నిన్న క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్.. 'పద్మావత్'లో నటించిన దీపికా పదుకునే చెవులు, ముక్కు కోసిన వారికి తమ కమ్యూనిటీ తరఫున రూ.కోటి నజరానా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ‘పద్మావత్’పై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలకు భారీ నజరానా ఇస్తామంటూ మరో గ్రూపు ప్రకటించింది. భన్సాలీ తల నరికిన వారికి రూ.51 లక్షల పారితోషికం ఇస్తామని ఆల్ ఇండియా బ్రజ్మండల్ క్షత్రియ రాజ్పుత్ మహాసభ ప్రకటించింది. భన్సాలీని హత్య చేస్తే తక్షణమే ప్రకటించిన బహుమతి అందిస్తామని బ్రజ్మండల్ క్షత్రియ రాజ్పుత్ మహాసభ ఉపాధ్యక్షుడు దివాకర్ సింగ్ వెల్లడించారు.
అలాగే తమ ఆందోళనను పట్టించుకోని రాజకీయవేత్తలకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. రాజపుత్లు నిరాయుధులు, మహిళలు, పిల్లలపై ఎప్పటికీ దాడి చేయరని, ఇటీవల గుర్గావ్లో చిన్న పిల్లల బస్సు అద్దాలని ధ్వంసం చేసింది తమ వారు కాదని చెప్పుకొచ్చారు.
కాగా, రాజ్పుత్లను చెడ్డగా షూట్ చేసిందని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించారంటూ మండిపడుతూ ఆందోళనకు దిగింది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి యు/ఏ సర్టిఫికేట్ పొందిన తరువాత, జనవరి 25న విడుదలైన గత రెండు రోజుల్లో ర్యాలీలు, విధ్వంసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.