ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ – బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుకోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ – బీజేపీ పొత్తుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారు. తన తండ్రి వైఎస్, టీడీపీ అధినేత చంద్రబాబు లాగే తనకు కూడా పాదయాత్ర కలిసొస్తుందనే ఉద్దేశంతో జగన్ ఉన్నారు. అదే సమయంలో తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడం ద్వారా ఆ మచ్చను కూడా చెరిపేయాలనుకుంటున్నారు. అందుకే కేంద్రంలోని బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలనుకుంటున్నారు.
మరోవైపు బీజేపీ కూడా ఈసారి కేంద్రంలో తమదే అధికారమని గట్టిగా నమ్ముతోంది. తాజా సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే ఈసారి కాస్త సీట్లు తగ్గుతాయనే సంకేతాలు వస్తుండడంతో బీజేపీ అప్రమత్తమైంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రాంతీయ పార్టీలతో పొత్తుల రాయబారాలను నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తు తమకు ఇబ్బందులు తెస్తుండడంతో ప్రతిపక్ష వైసీపీతో వెళ్తుందనే అంశాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి ఓ ప్రతిపాదన కూడా వైసీపీ ముందుంచినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలనేది జగన్ కోరిక. కేంద్రంలో మళ్ళీ తామే ఉండాలేనిది బీజేపీ ఉద్దేశం. ఇందుకోసం ఏపీలో ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ పోటీ చేయడం, ఎంపీ స్థానాలను బీజేపీకి కేటాయించడం అనేది ఓ ప్రతిపాదనగా తెలుస్తోంది. అయితే ఇందుకు వైసీపీ ఎంతమేరకు అంగీకరిస్తుందనేదే చూడాలి. బహుశా ఈ ప్రతిపాదన సమ్మతం కాకపోవచ్చు. అదే జరిగితే పార్లమెంటులో వైసీపీకి ప్రాతినిధ్యం ఉండదు. అంతటి సాహసం జగన్ చేస్తారా అనేది వేచి చూడాలి.
ఇక రెండోది ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోకుండా.. అవసరార్థం ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవడమనేది మరో ప్రతిపాదన. ఎన్నికలకు ముందు జగన్ ను తమను కలుపుకుంటే ఇబ్బందులు వస్తాయేమోనని బీజేపీ సంశయిస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులు బలంగా ఉన్న జగన్ తో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటే అది దేశవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు పంపుతుందని బీజేపీ అధిష్టానం భయపడుతోంది. అందుకే ముందుకాకుండా.. ఎన్నికల తర్వాత అవసరార్థం పెట్టుకోవడం ద్వారా పెద్దగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చని అంచనా వేస్తోంది. అయితే ఈ ప్రతిపాదన రెండు పార్టీలకు అంతంతమాత్రమే దోహదపడుతుంది. ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ అత్యధిక స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటే బీజేపీ మళ్లీ చంద్రబాబుతోనే స్నేహం చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఎక్కువ స్థానాలున్న పార్టీలతోనే పొత్తు అవసరముంటుంది. ఒకవేళ టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువ సీట్లు దక్కితే అప్పుడు మరో ఆలోచన లేకుండా బీజేపీ వైసీపీతో దోస్తీ చేస్తుంది. అయితే ఇది ఎంతవరకూ సాధ్యమవుతుందనేది చూడాలి.
ఇక మూడోది.. అవసరార్థం చేసుకునే అవగాహన. ఎవరికివారు పోటీ చేస్తారు. అన్నీ సెట్ అయితే బీజేపీ మళ్లీ టీడీపీతోనే పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతుంది. ఒకవేళ సందర్భానుసారం కేంద్రంలో అవసరమైతే వైసీపీ మద్దతు కోరుతుంది. ఇప్పుడు జరుగుతున్నదిదే.! ఇప్పుడు కూడా కేంద్రంలో అవసరమైనప్పుడు వైసీపీ మద్దతిస్తోంది. దీనివల్ల అటు బీజేపీకి కానీ, వైసీపీకి కానీ నష్టముండదు. ఎవరి పనులు వాళ్లు చూసుకుంటూ ఉంటారు. అంతర్గత అవగాహన మేరకు నడుచుకుంటూ ఉంటారు. మరి చూద్దాం.. ఏ ప్రతిపాదనతో వీరిద్దరి స్నేహం ముందుకొస్తుందో.!