రాష్ట్ర విభజనచట్టంలో పేర్కొన్న అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు వాటి అమలకు సంబంధించి ఇప్పటివరకూ ఏమేం జరిగాయి.. ఇంకా జరగాల్సినవేంటి.. అనే అంశాలపై అధ్యయనం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ – JFCని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీలో చిరంజీవికి చోటు దక్కుతుందా.. అనే వార్త ఇప్పుడు ఆసక్తిగా మారింది.
పవన్ కల్యాణ్ ఏంచేసినా వెరైటీగా చేస్తారు. ప్రశ్నించడమే తన పని అన్నట్టు చెప్పే పవన్ అప్పుడప్పుడూ సమస్య పరిష్కారంకోసం అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బడ్జెట్లో రాష్ట్రానికి చూపడంపై టీడీపీ ఆందోళన చేయడం.. బీజేపీ ప్రత్యుత్తరమివ్వడం.. అన్నీ తామే చేశానని చెప్పుకురావడం, టీడీపీ వాటిని ఖండించడం.. ఇలా ఒక్కో అంశం వీధికెక్కింది. రాష్ట్రానికి ఎవరేం చేశారు.. ఎంత చేశారు.. ఇంకా చేయాల్సినవేంటి.. అనే అంశాలపై అధ్యయనం చేస్తే బాగుంటుందని పవన్ కల్యాణ్ భావించి తెలంగాణ ఉద్యమంలో జేఏసీ లాగా.. JFC ఏర్పాటు చేశారు.
లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, సీపీఐ నేత రామకృష్ణ.. తదితరులు ఈ కమిటీలో ఉంటారని ఇప్పటికే పవన్ ప్రకటించారు. అంతేకాక.. పలువురు మేధావులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ కమిటీలో ఉండేవాళ్ల లిస్టు చూసి తానే ఆశ్చర్యపోయానని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఆ జాబితా చూసి పవన్ కల్యాణ్ కు సమస్య పరిష్కారం కోసం ఉన్న పట్టుదల అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో కమిటీలో అన్న చిరంజీవి కూడా ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన చిరంజీవి.. కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పదవీకాలం కూడా పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవికి కమిటీలో చోటు దక్కించడం వెనుక ఓ ఉద్దేశం ఉందని పవన్ సన్నిహితులు చెప్తున్న మాట. రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీనే పార్లమెంటులో మద్దతిచ్చింది. విభజనచట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే.! ఈ నేపథ్యంలో నాడు పదవిలో ఉండి చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తులను ఇప్పుడు కమిటీలో భాగస్వాములను చేయడం ద్వారా ప్రశ్నించేందుకు మరింత ఎక్కువ ఆస్కారం ఉంటుందని పవన్ భావిస్తున్నారట. అందుకే చిరంజీవికి కమిటీలో స్థానం కల్పించడం ద్వారా నాడు బిల్లుకు మద్దతిచ్చిన వారే.. ఇప్పుడు వాటి అమలుకోసం కూడా ప్రయత్నించినట్లవుతుందని ఫీలవుతున్నారు.