మంత్రి ఆదినారాయణ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పారు. పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు అందకుండానే... జగన్ ప్రకటనలకు స్పందిస్తూ... వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తే... మార్చి 5న మా కేంద్ర మంత్రులు కూడా పదవులకు రాజీనామాలు చేస్తారని ప్రకటించి మరోసారి సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ఆదినారాయణ రెడ్డి.
ఓ పక్క రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని టీడీపీ, వైసీపీ ఎంపీలు ఎవరికి వారు పోటా పోటీగా ప్రకటనలు, నిరసనలు చేస్తున్నారు. జగన్ నెల్లూరు పాదయాత్ర సమయంలో వైసీపీ ఎంపీలు తమ పదవికి ఏప్రిల్ 6 రాజీనామా చేస్తారు అని ప్రకటించారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలంటే రాజీనామాలే కరెక్ట్ అని టీడీపీ నేతలు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఐతే గురువారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు జగన్ ప్రకటనపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
సమన్వయ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను పెడచెవిన పెడుతూ మంత్రి ఆది నారాయణరెడ్డి నోరు జారారు. అధిష్టానం ఆదేశాలను పట్టించుకోకుండా జగన్ ప్రకటనకు కౌంటర్ గా... వైసీపీ ఎంపీల కంటే ముందే... మార్చి 5న మా కేంద్ర మంత్రులు రాజీనామా చేసి కేంద్రం నుంచి బయటకు వస్తారంటూ ప్రకటించేశారు.
మంత్రి వ్యాఖ్యలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పార్టీ అధిష్టానం నుంచి మంత్రికి ఫోన్లు రావడం... పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ హెచ్చరికలు రావడంతో ఆదినారాయణ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కితీసుకున్న ఆయన... అవి తన వ్యక్తిగత వ్యాఖ్యలని వీటితో పార్టీకి సంబంధం లేదన్నారు. మొత్తానికి ఆదినారాయణ రెడ్డి వ్యవహారంతో టీడీపీ సైతం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్... మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆవేశంలో మాట్లాడి ఉండొచ్చని... పార్టీ నిర్ణయాన్ని అధినేతే స్వయంగా ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు.
అయితే.. ఆది నారాయణ రెడ్డి నిర్మొహమాటంగా మాట్లాడుతుంటారు. పైగా బాబు దగ్గర మంచి పేరున్న మంత్రిగా పేరొందారు. జగన్ కు సరైన మొగుడు దొరికారంటూ టీడీపీలో చాలా మంది ఆదినారాయణ రెడ్డిని కొనియాడుతుంటారు. అలాంటి ఆది రాయణ రెడ్డి.. అంత పెద్ద కామెంట్స్ చేయడం వెనుక కచ్చితంగా స్ట్రాటజీ ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.