బీజేపీ టీడీపీ మధ్య రచ్చ తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇరు పార్టీలూ సై అంటే సై అనుకుంటున్నాయి. మార్చి 5 నుంచి తాడోపేడో తేల్చుకుంటామని ఓ వైపు టీడీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అంతకుముందే టీడీపీకి ఝలక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
బడ్జెట్ లో రాష్ట్రానికి న్యాయం జరగలేదంటూ రాష్ట్రం గళమెత్తింది. బీజేపీ మినహా అన్ని పార్టీలూ ఇదే స్వరం వినిపిస్తున్నాయి. ఏ రాష్ట్రానికీ చేయనంత మేలు ఏపీకి చేశామంటూ బీజేపీ లెక్కలు బయటపెట్టింది. వాటిని తిప్పికొడ్తూ టీడీపీ కూడా అంతే స్థాయిలో బీజేపీ లెక్కలను తిప్పికొట్టింది. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. విభజనచట్టంలోని అంశాలను పట్టించుకోకుండా అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన వాటిని కూడా లెక్కల్లో చూపి ఇంత చేశాం అని బీజేపీ చెప్తుండడం బాధాకరమనేది టీడీపీ వాదన. అయితే.. విభజన చట్టం అమలుకు పదేళ్ల సమయం ఉందని, ఒక్కొక్కటి అమలు చేస్కుంటూ వస్తున్నామనేది బీజేపీ చెప్తున్న మాట.
ఈ మాటల తూటాలు రోజురోజుకూ శృతి మించితున్నాయే తప్ప తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఓ వైపు దూకుడు పెంచింది. ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. తాజాగా పవన్ కల్యాణ్ జేఎఫ్సీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఎంపీలను కోరింది. దీంతో తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడ్తామని జగన్ ప్రకటించారు. ఒకవేళ టీడీపీ పెట్టినా తాము మద్దతిస్తామన్నారు. అయితే మార్చి 5న మలివిడత పార్లమెంట్ సమావేశాల్లోపు కేంద్రం న్యాయం చేయకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని గతంలోనే సుజనా చౌదరి వెల్లడించారు. దీంతో మార్చి 5లోపు బీజేపీ నుంచి తీపికబురు రాకపోతే కేంద్రం లోని మోడీ సర్కార్ నుంచి వైదొలిగేందుకు టీడీపీ సిద్ధమైంది.
అయితే మోడీ సర్కార్ నుంచి టీడీపై వైదొలగకముందే బీజేపీ మంత్రులు బాబు సర్కార్ నుంచి బయటకు రావాలని బీజేపీలోని ఓ వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. టీడీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వెనుకబడ్డామంటూ బీజేపీ సమావేశంలో నేతలు ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. రాష్ట్ర నాయకత్వంపై నేరుగానే విమర్శలు గుప్పించారు. అయితే కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని అధ్యక్షుడు హరిబాబు స్పష్టం చేశారు. ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే 5 నిమిషాల్లో రాజీనామా చేస్తానని మంత్రి మాణిక్యాల రావు ప్రకటించారు. అభిప్రాయాలను విన్న తర్వాత బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. టీడీపీ తదుపరి చర్యలు ఎలా ఉంటున్నాయో చూసి.. తదనుగుణంగా స్పందించాలని చివరకు నిర్ణయించారు. అవసరమైతే టీడీపీ కంటే ముందుగానే రిజైన్ చేసి బయటకు వచ్చేందుకు బీజేపీ సిద్ధమైనట్టు సమాచారం.