భారత దేశంలో కొంత కాలంగా మహిళలపై, వృద్దులపై చివరకు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా హత్యలు కూడా చేస్తున్నారు..కొంత మంది కామాంధులు. అలాంటి వారిని పోలీసులు నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి కొంత కాలానికి విడిచి పెడుతున్నారు. కుక్కతోక వంకర అన్నట్లే..ఆ కామాంధులు మళ్లీ రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ చిన్నారిపై పైశాచికంగా అత్యాచారం చేసి ఇద్దరు కామాంధులను పోలీస్ స్టేషన్ ముందే దారుణంగా కొట్టి చంపేసిన ఘటన అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే..వాక్రో సర్కిల్లోని నామ్గో గ్రామంలో ఐదున్నరేళ్ల చిన్నారి ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఐదురోజుల తర్వాత సమీపంలోని టీ గార్డెన్లో నగ్నంగా చిన్నారి శవం లభ్యమైంది. పోస్టుమార్టంలో బాలిక పైశాచికంగా అత్యాచారానికి గురైనట్లు తేలింది. ఈ కేసు విచారణలో భాగంగా సంజయ్, జగదీష్ లను అనుమానించిన పోలీసులు, వారిని అరెస్ట్ చేసి విచారించగా, తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో వీరిద్దరిని కోర్టులో ప్రవేశపెట్టి.. పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై ఆగ్రహాంతో ఉన్న నామ్గో గ్రామస్థులు నిందితులు తేజూ పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం తెలుసుకున్నారు. కర్రలతో ఒక్కసారిగా స్టేషన్పై దాడి చేశారు. ఇద్దరినీ బయటకు లాక్కొచ్చి నగ్నంగా మార్చారు. ఆపై రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. ఒక్కసారిగా స్టేషన్ పైకి వెళ్లిన వందలాది మందిని పోలీసులు నిలువరించలేకపోయారు.ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసిన పోలీస్ శాఖ.. ఎస్పీని బదిలీ చేసింది. ఖండూ ప్రభుత్వం ఘటనపై మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించింది.