రాష్ట్ర రాజకీయాల్లో నిన్నటివరకు చర్చంతా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయం.. కాని ఇప్పుడు చర్చంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలపైనే.. అందరి ఊహగానాలను పటాపంచలు చేస్తూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని చీకటి ఒప్పందాలు.. ప్యాకేజీ రాజకీయాలు తనకు తెలియవని చెప్పారు. ప్రజలు బాగుంటే దేశం బాగుంటుందంటూ రాష్ట్రంలోని అధికార టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీకి పవన్ సన్నిహితంగా ఉంటున్నారంటూ వస్తున్న ప్రచారంపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు. నాలుగేళ్లుగా ప్రభుత్వ పాలనను గమనిస్తున్నానని.. అయతే ఈనాలుగేళ్లు ప్రజా సంక్షేమం కంటే నాయకుల సంపాదన భారీగా పెరిగిపయిందని విమర్శించారు. ఇసుక మాఫియా, ఎర్రచందంనం స్మగ్లింగ్ వంటి వాటిల్లో ప్రజాప్రతినిధుల పాత్ర ఉంటున్నప్పటికీ ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఎమ్మార్వోపై దాడి చేసిన నేతపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు
నిన్నటి వరకు పవన్ వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించిన టీడీపీ.. పవన్ ప్రసంగం తర్వాత డైలామాలో పడిపోయింది. సీఎం చంద్రబాబు సమర్థవంతమైన నాయకుడని.. అటువంటి నాయకుడి పాలన అవసరమనే 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చానని చెబుతూ వచ్చిన పవన్ ఒక్కసారిగా తమపై దాడికి దిగడంతో టీడీపీ నేతలు షాకయ్యారు. స్వయనా సీఎం కుమారుడు.. మంత్రి నారాలోకేష్ అవినీతికి పాల్పడ్డారని.. ఆ జాతకాలు మొత్తం ప్రధాని మోదీ దగ్గరున్నాయని.. అందుకే కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా కొత్తనోట్లు తరలిస్తున్న కేసులో నిందితుడైన శేఖర్ రెడ్డితో లోకేష్ కు సంబంధం ఉందంటూ మరో బాంబు పేల్చారు.
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందంటూ వ్యాఖ్యానించారు. ప్రతి దానిలో సంపాదనే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని..ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని జనసేనాని విమర్శించారు. అనేక మంది పేర్లను ప్రస్తావించిన పవన్..ప్రభుత్వం ప్రజా సమస్యలపై సరిగ్గా స్పందించడంలేదన్నారు. కడప ఫాతిమా కళాశాల విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని అన్నారు. అలాగే అనేక సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పవన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేతలు స్పందించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్నతో పాటు మరికొందరు నేతలు పవన్ వ్యాఖ్యలను ఖండించారు. అవి పూర్తిగా నిరాధారమైనవని...చేసిన ఆరోపణలపై ఆధారాలుంటే నిరూపించాలని డిమాండ్ చేశారు..కేవలం ఓ సాధారణ రాజకీయ పార్టీ నాయకులు చేసే పనే పవన్ చేశారని..ఇందులో కొత్తదనం ఏంలేదంటూ కౌంటర్ ఇచ్చారు.
మొత్తం మీద టీడీపీ-జనసేనాని మధ్య సన్నిహిత సంబంధం ఉందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలపై ఓ క్లారిటీ వచ్చింది. ఇక పవన్ వ్యాఖ్యలపై టీడీపీ ఏ స్థాయిలో స్పందిస్తుందనేది వేచిచూడాల్సి ఉంది..గతంలో లా సానుకూలంగా స్పందిస్తుందో..లేకుండా జనసేనపై విమర్శల దాడిని ఎక్కుపెడతారో అనేది..ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.