టీమ్ ఇండియా క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం ఇబ్బందుల్లో కూరుకపోయున్న రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి ద్వారా తనకు రావలసిన 150 కోట్ల బకాయిలు చెల్లింపులపై న్యాయపోరాటానికి దిగారు. తనని కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొని గత ఐదు సంవత్సరాల నుండి తనకు రావలసిన చెల్లింపులని చెల్లించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ధోనినే గాక ఇతర భారత క్రికెటర్లయిన కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ లతో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెస్సీ ల ఆట వ్యవహారాలను చూసుకొనే రితి స్పోర్ట్స్ మేనేజిమెంట్ సంస్థ ఈ మేరకు ఆటగాళ్ల తరపున అమ్రపాలి కంపెనీపై ఢిల్లీ హైకోర్టులో రికవరీ దావాను వేసింది. కంపెనీ బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకాలపాల కోసం ఆటగాళ్లను వినియోగించుకొని అమ్రపాలి గ్రూప్ వారు చెల్లింపులను ఎగ్గొట్టారని అమ్రపాలి రితి స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ పాండే తెలిపారు.
దాదాపు అందరు ఆటగాళ్లకు కలిపి అమ్రపాలి గ్రూప్ వారు సుమారు రూ.200 కోట్ల రూపాయలను చెల్లించాలని అరుణ్ పాండే తెలిపారు. కాగా గత 6-7 సంవత్సరాల నుండి ధోని, అమ్రపాలి గ్రూప్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ కంపెనీ వినియోగదారులనుండి పెద్దఎత్తున చెల్లింపులను రాబట్టి కొన్ని నగరాల్లో హౌజింగ్ ప్రాజెక్ట్లను కూడా పూర్తి చేయలేదు. దీంతో 2016 లో వినియోగదారులు ట్విట్టర్లో ఈ కంపెనీని దుమ్మెత్తిపోస్తూ ధోనిని కూడా ట్యాగ్ చేయడంతో ఆయన ఈ కంపెనీతో తన ఒప్పందాన్ని రద్దుచేసుకున్న సంగతి తెలిసిందే.