ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలు, నిరాహారదీక్షలు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఢిల్లీలో అలాగే ఆంధ్రరాష్ట్రంలో ఆంధ్ర రాజకీయ నాయకుల దీక్షలు నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈ క్రమంలో బిజెపి పార్టీ పెద్దలు, దేశం మొత్తం ఒక రోజు నిరాహార దీక్ష చేయలంటూ తమ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చింది.
ఒక్క రోజు నిరాహార దీక్ష అంటూ మోడీ కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. బిజెపి నాయకులు ఒక రోజు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారంటే..కారణం పార్లమెంటు సభ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ..అత్యంత విలువైన పార్లమెంటు సభాకాలాన్ని వృధా చేశారంటూ దీక్షకు పూనుకున్నారు.
అయితే ఈ క్రమంలో ఆంధ్రరాష్ట్రంలో రాష్ట్ర బిజెపి పార్టీ నాయకులతో దీక్షలో పాల్గొనడానికి బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఢిల్లీ నుంచి విజయవాడకు రావడం జరిగింది. అయితే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం బిజెపి నాయకులు విజయవాడలో దీక్ష చేయడానికి అనుమతి లేదంటూ జీవీఎల్ నరసింహరావును అడ్డుకున్నారు.
దీంతో జీవీఎల్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సీపీఐ ధర్నాకు అనుమతి ఇచ్చి తమకు ఎందుకు నిరాకరించారంటూ ఆయన చంద్రబాబుపై ఆగ్రహించారు. అంతేకాకుండా త్వరలో చంద్రబాబుకి ఆంధ్ర ప్రజల ఉసురు తగులుతుందని హెచ్చరించారు.