కేంద్రంలో బీజేకీ పెద్ద షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఆయన... బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోననీ.. అయినప్పటికీ ప్రజాస్వామ్యం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ పాట్నాలో ప్రతిపక్షాలతో కలిసి నిర్వహించిన ఓ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ... ‘‘బీజేపీతో అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్టు ఇదే వేదికగా ప్రకటిస్తున్నాను.
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఇటీవల పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కేంద్రం వైఖరే కారణం. ప్రధాని మోదీ కనీసం ఒక్కసారైనా ప్రతిపక్షాలను పిలిచి ఎందుకు చర్చించలేకపోయారు..’’ అంటూ ఆయన నిలదీశారు.ఈ సమావేశానికి కాంగ్రెస్, సమాజ్ వాదీ , తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాగా, 2002-04 మధ్య కాలంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎక్స్ టర్నల్ అఫైర్స్ శాఖా మంత్రిగా, 1998-2002 లో ఫైనాన్స్ మినిస్టర్ గా యశ్వంత్ సిన్హా పని చేశారు.
ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్ లో యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా మంత్రిగా ఉన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన ఇటీవల ‘రాష్ట్ర మంచ్’ పేరుతో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేశారు. మరో బీజేపీ అసమ్మతి నేత శతృఘ్ను సిన్హా సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఇందులో చేరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్లో అనుసరించాల్సి వ్యూహంపై ‘రాష్ట్ర మంచ్’ వేదికగా నేతలు చర్చలు జరపనున్నారు.