ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికివారు తమ పటిష్టతకోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న తర్వాత పార్టీలన్నీ జోరు పెంచాయి. వైసీపీ కూడా దూకుడు పెంచింది. చంద్రబాబు డైరెక్ట్ గా టార్గెట్ చేయడంతో బీజేపీ ఒంటరిగా మిగిలింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో గవర్నర్ ఆకస్మిక భేటీ ఆసక్తి కలిగిస్తోంది.
విశాఖపట్నంలో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహనే నేరుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన ఆర్థాంతరంగా వైజాగ్ నుంచి రైలులో బయలుదేరి విజయవాడ వచ్చారు. శనివారం రాత్రికి ఆయన విజయవాడ చేరుకుని హోటల్ లో బస చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చంద్రబాబు గవర్నర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ తన పర్యటనలో అప్పటికప్పుడు మార్చుకుని హైదరాబాద్ వెళ్లకుండా విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏకాంతంగా చర్చలు జరపడం వెనుక కారణాలు ఏమై ఉంటాయోననే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే గవర్నర్ నరసింహన్ హుటాహుటిన బయలుదేరి విజయవాడ వచ్చి చంద్రబాబుతో చర్చించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో వైరం పనికిరాదని, స్నేహ హస్తం అందించేందుకే గవర్నర్ ను రాయబారిగా పంపించారని సమాచారం. గవర్నర్ ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపెట్టి చంద్రబాబుకు వివరించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంతో సఖ్యతగా ఉండడం మంచిదని, ఎందుకు వైరం పెంచుకుంటున్నారని గవర్నర్ చంద్రబాబును అడిగినట్టు తెలుస్తోంది. అయితే తనకు కేంద్రంతో వ్యక్తిగత వైరమేదీ లేదని, రాష్ట్రాభివృద్దికి సహకరించకపోవడం వల్లే బయటికొచ్చానని క్లారిటీ ఇచ్చారట. ఇప్పటికైనా కేంద్రం సహకరిస్తే తనవైపు నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని చంద్రబాబు తెలియజేశారట.
అంతేకాక.. కర్నాటకలో తెలుగువారంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలంటూ టీడీపీ ఇచ్చిన పిలుపును బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయొద్దంటూ గవర్నర్ ద్వారా రిక్వస్టే చేసినట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తానెప్పుడూ అలా పిలుపు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడేదిలేదని మాత్రమే చెప్పానని చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో.. ఓవరాల్ గా గవర్నర్ ద్వారా బీజేపీ చంద్రబాబుతో రాయబేరానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ పరిణామాలు ఎటు వెళ్తాయో వేచి చూద్దాం.