ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 29వ తేదీన ఉదయం 11 గంటలకు వైజాగ్ వేదికగా ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్ణయం తీసుకున్నారు. వచ్చేనెల 4న టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, జూన్ 10 నుంచి టెట్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి గంటా ఈ రోజు సమీక్ష నిర్వహించి, ఆగస్టులోగా డీఎస్సీ నిర్వహించాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల్లోగా ఖాళీలపై స్పష్టత ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గతంలో లాగానే ఆన్ లైన్ లో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ లెర్నింగ్, వయోజన విద్య, మౌలిక వసతులు, లైబ్రరీలు, ఉపాధ్యాయ శిక్షణ వంటి అంశాల్లో రోటరీ క్లబ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని సూత్రప్రాయంగా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు డీఎస్సీపై ఈ మేరకు ప్రకటన త్వరలో విడుదల చేస్తామని మంత్రి గంటా తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం చేసే దిశగా పాఠశాలల్లో కల్పించనున్న మౌలిక వసతుల కల్పనపైనా చర్చ జరిగింది.
యాన్యుటీ ప్రాతిపదికన పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక వసతులను ఎలా కల్పించాలి? తొలుత ప్రాధాన్యం దేనికి ఇవ్వాలన్న అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ..అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మోడల్ స్కూళ్లల్లో వసతులు, సదుపాయాలపై విస్తృత చర్చ జరిగింది.
మే 1 నుంచి జరగాల్సిన జ్ఞానధార కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్ - ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా వినూత్న సంస్కరణలు ఆచరణాత్మక చేపట్టాలని ఆయన అధికారులకు పిలుపు ఇచ్చారు. కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న పలు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు సంబంధించి జీవోలు జారీ చేసి.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని గంటా శ్రీనివాసరావు సమావేశంలో స్పష్టం చేశారు.