మీడియాకు భయపడి పారిపోవాలా..? ఎదురు తిరిగితే ఏమవుతుంది..? మహా అయితే ఏం చేస్తారు..? లాంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా పవన్ కళ్యాణ్ మీడియాపై యుద్ధమే ప్రకటించారు. రాజకీయ కారణాలతో ముడిపెట్టి మీడియాను అందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తెరవెనుక కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతోనే కొన్ని ఛానెళ్లు తనపై కుట్ర చేస్తున్నాయని విమర్శిస్తున్న పవన్.. తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. సదరు ఛానళ్లపై న్యాయపోరాటానికి రెడీ అంటోన్న పవన్.. అందుకు సిద్ధం కావాలంటూ ట్వీట్లతో స్వీట్ వార్నింగ్ లు ఇస్తున్నారు. అంతేకాదు.. కొన్ని ఛానెళ్ల అధిపతులు, సీఈవోలపై గతంలో వచ్చిన ఆరోపణలను కోట్ చేస్తూ వారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా సంస్థలతో తెలుగుదేశం పార్టీ నేతలకు ఉన్న ఆర్ధిక లావాదేవీలను సైతం బయటపెడుతున్న పవన్.. అన్ని నిజాలు త్వరలోనే బయటకొస్తాయంటున్నారు.
తనపైనా, తన కుటుంబంపైనా అనుచిత వ్యాఖ్యలు చేయించి దానిపై డిబేట్ లు పెట్టారని ఆరోపిస్తున్న పవన్ .. సదరు ఛానెళ్లపై న్యాయపోరాటం చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఆమేరకు తన కార్యాచరణను వేగవంతం చేశారు. తెలుగుదేశం కుట్రలో భాగమైన సదరు ఛానెళ్లకు త్వరలోనే లీగల్ నోటీస్ పంపిస్తానని హెచ్చరించిన పవన్.. సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు. అంతేకాదు.. అదేవిధంగా పోలీసులు తనపై 8నెలలుగా జరుగుతున్న డిబేట్ లను పరిశీలిస్తే కుట్రకోణం అర్ధం అవుతుందని ట్వీట్ చేశారు. సదరు ఛానల్స్ ను బాయ్ కాట్ చేయాలని ఇప్పటికే అభిమానులకు పిలుపునిచ్చిన పవన్... చంద్రబాబు, లోకేష్ సన్నిహితుడొకరు ఈ కుట్ర నడిపిస్తున్నారని చెప్పారు. సదరు చానళ్లతో టీడీపీ నేతలకు ఉన్న లింకులను బయటపెట్టేందుకు పవన్ ట్రై చేస్తున్నారు.
వాస్తవానికి మీడియాపై రాజకీయ నేతల ఆరోపణలు మనరాష్ట్రంలో కొత్తేమీ కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఓ వర్గం మీడియాను ఎల్లో మీడియా అంటూ పదేపదే సంబోధించే వారు. ఆ రెండు ఛానెళ్లు తనపై వ్యక్తిగతంగా, రాజకీయంగా కుట్రచేస్తున్నాయని విమర్శించిన వైయస్ఆర్.. అనేక సందర్భాల్లో అసెంబ్లీలోనూ ఛానెళ్ల పేర్లతో సహా ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేసేవారు. ఇప్పడు అదే రేంజ్ లో మీడియాపై ఎదురుదాడి చేస్తున్న పవన్.. తనపై జరుగుతోన్న కుట్రను తన అభిమానులు, ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తమ్మీద శ్రీరెడ్డి వ్యవహారం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకోవడం, అది కూడా పవన్ వర్సెస్ మీడియా అన్నట్టు మారిపోవడంతో ప్రస్తుత పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
మీడియాకు భయపడి దూరం పారిపోయే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఎదురుదాడే.! నాడు వై.ఎస్. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. వై.ఎస్. ఎదురుదాడి చేసిన తర్వాత మీడియా విపరీత పోకడలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మీడియాను కూడా పాలిటిక్స్ నియంత్రించగలవని చూపించారు వై.ఎస్.ఆర్. ఆ తర్వాత కేసీఆర్ కొన్ని మీడియా ఆర్గనైజేషన్స్ పై ఉక్కుపాదం మోపారు. చంద్రబాబు కూడా ఓ వర్గం మీడియాను కొంతకాలం పాటు నిలిపేయించారు. సో.. ఇప్పుడు మీడియా అంటే భయపడే రోజులు పోయాయ్..