కర్నాటక ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. బిజెపికి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నరేంద్రమోడికి వ్యతిరేకంగా తన కక్షను తీర్చుకోవటానికి చంద్రబాబు కర్నాటక ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు. ఎప్పుడైతే కేంద్రప్రభుత్వంలో నుండి ఆ తర్వాత ఎన్డీఏలో నుండి కూడా టిడిపి బయటకు వచ్చేసిందో అప్పటి నుండి భారతీయ జనతా పార్టీపై చంద్రబాబునాయుడు మండిపడుతున్నారు. మొదట్లో కాంగ్రెస్ అనుకూల ప్రచారం చేసినా ప్రస్తుతం మాత్రం బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయండంటూ టిడిపి నేతలతో చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారు.
ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో కాంగ్రెస్ కు ఓట్లేయాలన్న తన మాట చెల్లుబాటవుతుందో కాదో అన్న అనుమానం చంద్రబాబులో మొదలైంది. అందుకనే ఎవరికి ఓట్లు వేయాలో బహిరంగంగా చెప్పకపోయినా బిజెపికి వ్యతిరేకంగా మాత్రం బహిరంగ ప్రచారం చేస్తున్నారు. అంటే అటు కాంగ్రెస్ కు లేదా జెడిఎస్ కు జనాలు ఎవరికి ఓట్లేసినా తమ మాటే చెల్లుబాటైందని చెప్పుకోవటానికి వీలుగా చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది.
కర్నాటక ఎన్నికల్లో అవకాశం
రాష్ట్రంలో బిజెపి-టిడిపి మధ్య ఆధిపత్యంలో ఎవరిది గెలుపో తేలాలంటే సుమారు ఏడాదిపాటు వేచి ఉండాల్సిందే. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సుమారు ఏడాది కాలం ఉంది కాబట్టి అప్పటి వరకూ సస్పెన్సే. మరి, ఈలోగా చంద్రబాబు ఏం చేస్తారు? బిజెపి, నరేంద్రమోడిపై తనకున్న కసిని చంద్రబాబు తీర్చుకోవటానికి కర్నాటక ఎన్నికలు అందివచ్చాయి. అందుకనే పలువురు మంత్రులు, నేతలు కర్నాటక ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కొందరు బాహాటంగానే బిజెపిని వ్యతిరేకిస్తుండగా మరికొందరు మాత్రం చాపక్రిందనీరులాగ బిజెపికి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా టిడిపి చేస్తున్న ప్రచారం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
టిడిపి నేతల క్యాంప్
కర్నాటక ఎన్నికలు మొదలైనప్పటి నుండి పలువురు టిడిపి నేతలు పలు ప్రాంతాల్లో క్యాంపు వేశారు. వారంతా ప్రధానంగా బిజెపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటూ పిలుపిస్తున్నారు. అంతేకానీ ఏ పార్టీకి ఓట్లు వేయాలో మత్రం బహిరంగంగా చెప్పటం లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనపుడు మాత్రం మంత్రులు అచ్చెన్నాయడు, కెఇ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప లాంటి వారు బాహాటంగానే కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందంటూ పలుమార్లు జోస్యం చెప్పారు. అదే పద్దతిలో కర్నాటకలో ప్రచారం కూడా చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల నుండి కాకుండా కడప, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల నుండి పెద్ద ఎత్తున తెలుగువాళ్ళు కర్నాటకలోని పలుప్రాంతాల్లో స్ధిరపడ్డారు.
తెలుగు ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్
కర్నాటక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా తెలుగు ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం ఓటర్లలో తెలుగు ఓటర్లే తక్కువలో తక్కువ సుమారు కోటిమంది ఉంటారని ఓ అంచనా. హోసూరు, చిక్ మగళూరు, బెంగుళూరు నగరం, ఉడిపి, మైసూరుచ బళ్ళారి ప్రాంతాల్లో తెలుగువాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు.