ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లాలో తెలుగుదేశంపార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. జిల్లాకు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పని చేసిన చమన్ సోమవారం ఆకస్మికంగా మరణించారు. చమన్ కు గుండెపోటు వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఆసుపత్రికి తరలించేలోగానే మాజీ ఛైర్మన్ మరణించినట్లు సమాచారం.
మాజీ మంత్రి, టిడిపి నేత దివంగత పరిటాల రవికి అత్యంత సన్నిహితుడు. జిల్లాలో రవికి దశాబ్దాల కాలం పాటు ఎదురులేకుండా ఉన్నదంటే అందులో చమన్ పాత్ర కూడా తక్కువేమీ కాదు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిటాల సునీత మద్దతుతో చమన్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా నియమితులయ్యారు.
చమన్ మృతి విషయం తెలుసుకున్న టీడీపీ అభిమానులు, రవి అనుచరులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు.. మంత్రి పరిటాల సునీత కొద్దిసేపటి క్రితం అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని రామగిరి మండలం కొత్తపల్లికి తరలించనున్నారు.