చంద్రబాబునాయుడుతో అమీతుమీ తేల్చుకోవటానికి కెసిఆర్ నిర్ణయించుకున్నారా ? కెసిఆర్ తాజా నిర్ణయంతో తెలుగురాష్ట్రాల్లో రాజకీయ ముసలం తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అదే అనుమానాలు మొదలయ్యాయి. తెలంగాణా సిఎం కెసిఆర్ కేంద్రంగా సోమ, మంగళవారాల్లో జరుగుతున్న పరిణామాలు కూడా అవే సూచనలను స్పష్టంగా చెబుతున్నాయి. మూడేళ్ళుగా మూలనపడి ఉన్న ఓటుకునోటు కేసుపై కెసిఆర్ జరిపిన సమీక్షతో రాజకీయంగా తెలుగుదేశంపార్టీలో కలకలం మొదలైంది. అదలావుంటే మంగళవారం మధ్యాహ్నం కూడా ఓటుకునోటు కేసుపై సమీక్షించటమే కాకుండా చంద్రబాబు భూ ఆక్రమణలపైన వారంలోగా ఓ కమీషన్ వేయాలని నిర్ణయించటం సంచలనం రేపుతోంది. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుపై కెసిఆర్ పగపట్టారా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
కెసిఆర్ ఎందుకు పగపట్టారు ?
ముఖ్యమంత్రులైన దగ్గర నుండి చంద్రబాబు-కెసిఆర్ మధ్య ఏమాత్రం సఖ్యత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు మొదటి ఏడాదిలోనే ఓటుకునోటు ఘటన వెలుగు చూడటంతో కెసిఆర్ పూర్తిగా అప్రమత్తమయ్యారు. తనను రాజకీయంగా అస్దిర పరిచేందుకే, ప్రభుత్వాన్ని కూలదోసేందుకే చంద్రబాబు కుట్రపన్నినట్లు కెసిఆర్ అనుమానించారు. దాంతో చంద్రబాబుపై కక్షకట్టారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చంద్రబాబును పూర్తిగా తొక్కేస్తున్నారు. అందులో భాగంగానే పదేళ్ళపాటు ఉమ్మడి రాజధాని అయినా ఏడాదిలోనే చంద్రబాబును హైదరాబాద్ నుండి వెళ్ళిపోయేట్లు కెసిఆర్ చేశారు.
థర్డ్ ఫ్రంట్ కు చంద్రబాబు అడ్డంకా ?
ప్రధానమంత్రి నరేంద్రమోడికి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ను బలోపేతం చేయాలని కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు అడ్డంకిగా మారారా ? అన్న అనుమానాలు టిఆర్ఎస్ లో బలంగా ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జాతీయస్ధాయిలో కెసిఆర్ కన్నా చంద్రబాబుకే మద్దతు ఎక్కువుంది. కెసిఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టినపుడు మద్దతుగా నిలుస్తామన్న పార్టీల అధినేతలు ఇపుడు హ్యాండిచ్చారు. ఏ విషయంలోనూ మమతా బెనర్జీ, కరుణానిధి, కేజ్రీవాల్, నితీష్ కుమార, రాజ్ థాక్రే లాంటి వాళ్ళు కెసిఆర్ తో కలిసి నడవటానికి ఇష్టపడటం లేదు. తెరవెనుక నుండి చంద్రబాబు చేస్తున్న మంత్రాంగం వల్లే తన ప్రయత్నాలు ముందుకు సాగటం లేదని కెసిఆర్ అనుమానపడుతున్నట్లు టిఆర్ఎస్ వర్గాలంటున్నాయి.
కాంగ్రెస్ తో పొత్తు ప్రచారం కూడా కారణమేనా ?
తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో టిడిపి-కాంగ్రెస్ మధ్య పొత్తుంటుందని జరుగుతున్న ప్రచారం కూడా కెసిఆర్ కు కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. తనను రాజకీయంగా దెబ్బకొట్టటానికే చంద్రబాబు కాంగ్రెస్ తో కలుస్తున్నారని కెసిఆర్ అనుమానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ను దెబ్బకొట్టటానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలన్నీ అందరికీ తెలిసిందే. కెసిఆర్ ను కాంగ్రెస్ ఎక్కడికక్కడ ఢీ అంటే ఢీ అంటోంది రాజకీయంగా. ఇటువంటి పరిస్దితుల్లో వచ్చే ఎన్నికల్లో టిడిపి-కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకుంటే కెసిఆర్ కు ఇబ్బందే అనటంలో సందేహం లేదు. అందుకే కాంగ్రెస్ ను ఏమీ చేయలేక చంద్రబాబు మీద కెసిఆర్ దృష్టి పెట్టినట్లు టిడిపి అనుమానిస్తోంది. ఇప్పటికే ఉన్న ఓటుకునోటు కేసును తిరగతోడితే చాలు చంద్రబాబు పనైపోతుందని కెసిఆర్ భావిస్తున్నారు కాబట్టే ఓటుకునోటులో హటాత్తుగా కదలిక తెచ్చారని టిడిపి అనుమానిస్తోంది.