ఏపి ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాటలు కోటలు దాటుతున్నాయ్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం సమైక్య ఉద్యమానికి మించిన ఉద్యమం నడుపుతారట. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసం బుధవారం ఎన్జీవోల ఆధ్వర్యంలో జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరిగాయి. ఆ సందర్భంగా అశోక్ మీడియాతో మాట్లాడిన మాటలే విచిత్రంగా ఉన్నాయ్. హోదా కోసం అన్నీ రాజకీయ పార్టీలు కలసి రావటం లేదంటూ ఆరోపించటం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, రాష్ట్ర విభజనకు ముందు కూడా ఏపి ఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యమం నడిచింది. అయితే ఆ ఉద్యమాన్ని నీరుగార్చిందే అశోక్ బాబనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.
ఉద్యమాన్ని నీరుగార్చిందే అశోక్
ఎలాగంటే, అప్పట్లో ఉద్యోగులు చేసిన ఉద్యమానికి రాజకీయ పార్టీలను దూరంగా పెట్టేసిన ఘనత అశోక్ బాబుకే దక్కుతుంది. రాజకీయ పార్టీల మద్దతు లేకుండా ఏ ఉద్యమం కూడా విజయవంతమైన దాఖలాలు చరిత్రలే లేవు. ఒకవైపు ప్రత్యేకంగా తెలంగాణా కావాలంటూ జెఏసి అన్నీ రాజకీయ పార్టీలను ఉద్యమంలోకి తీసుకొస్తే, ఏపిలో మాత్రం రాజకీయ పార్టీలను ఉద్యమానికి దూరంగా ఉంచింది అశోక్ బాబే. ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు పలికిన రాజకీయ పార్టీలను దూరంగా ఉంచమని అప్పట్లో పిలుపిచ్చింది కూడా ఇదే అశోక్ బాబన్న విషయం అందరికీ తెలిసిందే.
హోదా డిమాండ్ సజీవంగా ఉన్నదే జగన్ వల్ల
ఇక ప్రస్తుత విషయానికి వస్తే గడచిన నాలుగేళ్ళుగా ప్రత్యేకహోదా కోసం ఉద్యమాలు చేసింది, హోదా సెంటిమెంటును సజీవంగా ఉంచింది కేవలం వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు, కార్యక్రమాలను వైసిపి నిర్వహించింది. అప్పట్లో హోదా విషయంలో చంద్రబాబు ఏ విధంగా వ్యవహరించారో అందరూ చూసిందే. హోదా కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్ధులపై కేసులు కూడా పెట్టించారు. ఆ సమయంలో ఇదే అశోక్ బాబు ప్రత్యేకహోదా కోసం మాట మాత్రం కూడా ఎప్పుడూ మాట్లాడలేదు.
చంద్రబాబు లాగ అశోక్ కూడా యు టర్న్
ఎప్పుడైతే జనాల్లోని సెంటిమెంటును చూసి, వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే చంద్రబాబు యు టర్న్ తీసుకుని ప్రత్యేకహోదా కోసం మాట్లాడటం మొదలుపెట్టారో అప్పటి నుండే అశోక్ కూడా హోదా కోసం మాట్లడటం మొదలుపెట్టారు. ఇపుడు అశోక్ మాటలు చూస్తుంటే తామేదో చాలా కాలంగా ప్రత్యేకహోదా కోసం పోరాటాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. అంటే, చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటారన్న ఆరోపణలకు అశోక్ మాటలు ఊతమిస్తున్నాయి.