జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించింది. ప్రస్తుత పొలిటకల్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా పవన్ నిలుస్తాడని పవన్ పై చాలా మంది అంచనాలు పెట్టుకున్నారు. అయితే పవన్ కూడా అన్న బాటలోనే పయనిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
ఇటీవలికాలం వరకూ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. ప్రత్యేక హోదా కోసం పోరాటం తప్పదని మొదట హెచ్చరించింది పవన్ కళ్యాణే.! ఆ తర్వాతే వైసీపీ, టీడీపీ గళమెత్తాయి. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు హెచ్చరించారు. ఆ తర్వాత దాన్ని మర్చిపోయారు. ప్రత్యేక హోదా కోసం నిర్దిష్టంగా పవన్ కళ్యాణ్ చేసిందేమీ లేదు. దీంతో పవన్ పై నమ్మకం పోయింది. అంతేకాక.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత బీజేపీని పల్లెత్తుమాట అనలేదు. దీంతో పవన్ ను బీజేపీయే ఆడిస్తోందనే ఊహాగానాలు వినిపించాయి. పవన్ తీరు కూడా ఇందుకు బలపడేలా ఉంది. ఎందుకంటే బీజేపీని ఎక్కడా విమర్శించకపోవడమే ఇందుకు దోహదం చేస్తోంది.
ఇక శ్రీరెడ్డి ఇష్యూలో పవన్ చేసిన హడావుడి ఆయన ఇమేజ్ ను చాలా డ్యామేజ్ చేసింది. ఫిల్మ్ చాంబర్ లో అందరినీ నోటికొచ్చినట్లు మాట్లాడిన తీరు సినీ వర్గాలను విస్మయానికి గురిచేసినట్లు సమాచారం. పవన్ ఆగ్రహానికి భయపడిపోయిన ఇండస్ట్రీ మొత్తం ఆ తర్వాత ఆ అంశంపై చర్చోపచర్చలు చేసింది. ఇదే సమయంలో పవన్ కు చేరువైంది ఫ్యామిలీ. ఫిల్మ్ చాంబర్ లో పవన్ ఉన్నప్పుడు నాగబాబు, రాంచరణ్, అల్లు అర్జున్ తదితరులు వెళ్లి పవన్ తో చర్చించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఆ తర్వాత జరిగిన పలు కార్యక్రమాల్లో పవన్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి పాల్గొన్నారు. అప్పటివరకూ ఫ్యామిలీకి దూరంగా ఉన్న పవన్ కు ఓ ఇమేజ్ ఉండేది. చిరంజీవి చేసిన తప్పులకు బాధపడి ఆ ఫ్యామిలీకి దూరంగా పవన్ రాజకీయాలు చేస్తున్నారని, నాడు ప్రజారాజ్యంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగవని అందరూ ఆశించారు. అయితే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఏకమైంది. అల్లు అరవింది, అల్లు అర్జున్, నాగబాబు, రాంచరణ్.. తదితరులంతా మళ్లీ పవన్ పంచన చేరారు. దీంతో పవన్ పై అప్పటి వరకూ ఉన్న ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది.
పవన్ గతంలో చాలా సార్లు ప్రజారాజ్యంతో జనసేనను పోల్చవద్దని సూచించారు. తానిప్పుడు తనదైన శైలిలో రాజకీయం చేయనున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీకి లొంగకుండా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పవన్ పని చేస్తారని ఆయన అభిమానులతో పాటు కార్యకర్తలు ఆశించారు. అయితే..శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత మీడియాపై పవన్ వ్యవహరించిన తీరు, ఫ్యామిలీతో కలిసిపోయి తామంతా ఒక్కటే అని చాటిచెప్పిన తీరు చాలా మందిని విస్మయానికి గురిచేసింది. దీంతో పవన్ కు గతంలో ఉన్నంత క్రేజ్ లేదు. కాస్త తగ్గింది. మీడియా ఫోకస్ కూడా తగ్గింది. గతంలో ప్రభుత్వం కూడా పవన్ కు హయ్యస్ట్ ప్రయారిటీ ఇచ్చేది. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఓవరాల్ గా పవన్ ఇప్పుడు ఒంటరి. ఆయన వెనుక బీజేపీ ఉందనే టాక్ వినిపిస్తున్నా.. బయటకు చెప్పుకోలేని పరిస్థితి. మరి ఈ సిచ్యుయేషన్ ను పవన్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.