వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలవటం చారిత్రక అవసరం....ఇది చంద్రబాబునాయుడు చేసిన తాజా వ్యాఖ్య. టిడిపి నేతలతో శుక్రవారం చంద్రబాబు విస్తృత సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు చారిత్రక అవపరంగా చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల్లో గెలవటమన్నది ఏ పార్టీకైనా అవసరమే. ఎందుకంటే, రాజకీయ పార్టీలు పెట్టేది, పోటీ చేసేది రాజకీయ అధికారం కోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, తమ పార్టీ గెలవటమన్నది చారిత్రక అవరమని మామూలుగా ఏ పార్టీ అధినేత కూడా వారికి వారుగా చెప్పుకోరు. అటువంటిది ఇపుడు చంద్రబాబు చెప్పుకుంటున్నారంటేనే విచిత్రంగా ఉంది. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఏ విధంగా చారిత్రకమో మాత్రం చంద్రబాబు వివరించలేదు.
రాష్ట్ర విభజన తర్వాత టిడిపి-బిజెపి ఒక జట్టుగా, వైసిపి, కాంగ్రెస్, వామపక్షాలు కూడా పోటీ చేశాయి. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్సే కారణమన్న ఆగ్రహంతో ఉన్న జనాలు కాంగ్రెస్ అభ్యర్ధులకు మాత్రం ఎక్కడా గెలుపు అవకాశాలు ఇవ్వలేదు. పైగా 99 శాతం సీట్లలో కాంగ్రెస్ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కనీయలేదు. అదే సమయంలో బిజెపి-టిడిపిలకు జనాలు అందలం ఎక్కించారు. నిజానికి రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కు ఎంత పాపముందో బిజెపి, టిడిపిలు కూడా అంతే పాపం చేశాయి. ఎలాగంటే, పార్లమెంటులో బిజెపి సహకారం లేకుండా టిడిపి మద్దతు లేకుండా ఒక్క కాంగ్రెస్ మాత్రమే రాష్ట్ర విభజన చేయగలిగేది కాదన్న విషయం అందరికీ తెలిసిందే. వాస్తవం ఇదైతే జనాలు శిక్షమాత్రం ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే విధించారు.
చంద్రబాబుకు అందలం : రాష్ట్ర విభజనలో టిడిపి-బిజెపిలకూ భాగస్వామ్యం ఉన్నా జనాలు చంద్రబాబును అందలం ఎక్కించారు. ఎందుకంటే, అవినీతిపరునిగా ప్రచారంలో ఉండి, అప్పటికే 16 మాసాలు జైల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చిన జగన్ కు అధికారం అప్పగించలేక ఏదో చిన్న గీత పెద్ద గీత అన్న పద్దతిలో చంద్రబాబుకు అధికారం అప్పగించారు. అంటే, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటం అప్పట్లో అవసరంగా జనాలు భావించారనే అనుకోవాలి. అందులోనూ నరేంద్రమోడి హవా దేశంలో బాగుంది. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపికి అధికారం అప్పగిస్తే, కష్టాల్లో ఉన్న ఏపి బాగా అభివృద్ధి జరుగుతుందని జనాలు నమ్మారు. అందుకనే, టిడిపి-బిజెపిలకు అధికారం అప్పగించారు.
కానీ జరిగిందేమిటి ?
2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం అవసరమని జనాలు నమ్మి అధికారం అప్పగిస్తే జరిగిందేంటి ? జనాల నమ్మకాన్ని చంద్రబాబు ఎక్కడా నిలబెట్టుకోలేదు. ఎన్నికల్లో గెలవటమే ఏకైక లక్ష్యంతో ఆచరణకాని హామీలను ఎన్నింటినో చంద్రబాబు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయలేకపోయారు. అంతేకాకుండా ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం లాంటి ఏ ఒక్క విభజన హామీని కూడా ఆచరణలోకి తేలేకపోయారు. పైగా ఎక్కడ చూసినా అవినీతి ఆరోపణలే.
క్షీణించిన శాంతి భద్రతలు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా శాంతి, భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ఏ నేరం వెనుక చూసినా ఎక్కువ భాగం టిడిపి నేతల హస్తమే. ఎవరిపైనా చర్యలేకపోవటంతో ఫలితం ఎలాగుంటుందో అందరూ చూస్తున్నదే. వాస్తవాలు ఇలాగుంటే, వచ్చే ఎన్నికల్లో గెలవటం టిడిపికి చారిత్రక అవసరమని చంద్రబాబు చెప్పుకోవటం బాగానే ఉంది మరి జనాలు ఏమనుకుంటున్నారన్నదే ప్రధానం.