ఇటీవల కాలంలో చంద్రబాబునాయుడు ఆలోచనధోరణి గమనిస్తున్న వారికి ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, తన సహజశైలికి భిన్నంగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు, కార్యాచరణ రూపొందిస్తున్నారు. కేంద్రమంత్రివర్గంలో నుండి తప్పుకోవటం కావచ్చు లేదా ఎన్డీఏ లో ఉండి బయటకు వచ్చేయటం కావచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోడి పై చేస్తున్న విమర్శలు, ఆరోపణలు కూడా ఆ కోవలోకి వచ్చేవే అనటంలో సందేహం లేదు. పైగా కేంద్రంపై తాను యుద్ధం చేస్తున్నట్లు పదే పదే ప్రకటించటం ద్వారా అందరినీ చంద్రబాబు ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా తిరుమల దర్శనార్ధం వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడి ఘటన విషయంలో కూడా పలువురు పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.
తిరుమల ఘటన చంద్రబాబుకు తెలీదా ?
చంద్రబాబుకు తెలీకుండా పార్టీలో ఎటువంటి యాక్టివిటీ కూడా జరగదన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది అమిత్ ప్రయాణిస్తున్న కారుపై టిడిపి శ్రేణులు దాడులు జరపటమంటా మామూలు విషయం కాదు.
హిడెన్ అజెండాతోనే వ్యూహాలు
దశాబ్దాలుగా చంద్రబాబు శైలిని, వ్యూహాలను దగ్గర నుండి పరిశీలిస్తున్న నేతల ఆలోచన ప్రకారం చంద్రబాబు ఏదో హిడెన్ అజెండాతోనే వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది. మామూలుగా అయితే, కేంద్రమంత్రివర్గంలో నుండి టిడిపి తప్పుకోవటమన్నది జరిగే పనికాదు. టిడిపికి చెందిన ఇద్దరు మంత్రులతో చంద్రబాబు రాజీనామా చేయిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఎంత వివాదం రేగినా, రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతున్నా మూడున్నరేళ్ళు పట్టించుకోని చంద్రబాబు అంత హటాత్తుగా కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
సహజత్వానికి భిన్నంగా
అదే ఊపులో కొన్ని రోజుల తర్వాత ఏకంగా ఎన్డీఏలో నుండి కూడా తప్పుకోవటాన్ని పార్టీలోని పలువురు నేతలతో పాటు బిజెపి నేతలు కూడా ఏమాత్రం ఊహించలేదు. పై రెండు నిర్ణయాలు కూడా తన సహజత్వానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించినవే. పలుమార్లు కేంద్రంపై యుద్ధం ప్రకటించటమే కాకుండా నేరుగా మోడినే లక్ష్యం చేసుకుని పలుమార్లు ఆరోపణలు చేస్తున్నారు. మామూలుగా అయితే, అటువంటి ప్రకటనలు, ఆరోపణలు చంద్రబాబు నుండి ఎవ్వరూ ఊహించరు. ఇపుడు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు, ప్రకటనలు పార్టీలోని నేతల ద్వారా బయటకు వస్తుంటాయి. అపుడు బిజెపి వైపు నుండి ఏమైనా గొడవైతే అపుడు చంద్రబాబు రంగంలోకి దిగి నేతలను అదుపు చేస్తున్నట్లు నటించేవారు.
అమిత్ కాన్వాయ్ పై దాడి
తాజాగా అమిత్ కాన్వాయ్ పై జరిగిన దాడి విషయంలో పార్టీలోనే నేతలే బోలెడు ఆశ్చర్యపోతున్నారు. అమిత్ షా కాన్వాయ్ పై టిడిపి శ్రేణులు దాడి చేయటమంటే మాటలు కాదు. పార్టీ తరపున ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే చంద్రబాబుకు తెలీకుండా జరగదు. అటువంటిది బిజెపి జాతీయ అధ్యక్షుడు, ప్రధానమంత్రి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన నేత కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం ముందుగా చంద్రబాబుకు తెలీకుండా జరిగే ఛాన్సే లేదని పార్టీలోని నేతలు గుసగుసలు పోతున్నారు. బిజెపి నేతలు కూడా అదే విషయమై చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. కాకపోతే చంద్రబాబు ప్రదర్శిస్తున్న తాజా ధోరణితో పార్టీకి ఏ మేరకే ఉపయోగముంటుందో వేచి చూడాల్సిందే.