అందరూ ఊహించినట్లే కర్నాటక ఎన్నికలు అందరిలోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఉదయం కౌటింగ్ మొదలైనప్పటి నుండి 191 నియోజకవర్గాల్లో కాంగ్రెస్-బిజెపిల అభ్యర్ధుల లీడ్లు పోటా పోటీగా ఉంటున్నాయి. 191 నియోజకవర్గాల్లో బిజెపి 83 నియోజకవర్గాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్ధులు 79 నియోజకవర్గాల్లో లీడ్లో ఉన్నారు. జెడిఎస్ అభ్యర్ధులు 28 నియోజకవర్గాల్లో మిగిలిన అభ్యర్ధులకన్నా ముందంజలో ఉండటం గమనార్హం.
అంటే, కౌంటింగ్ సరళిని గమనిస్తుంటే ఇదే విధమైన ట్రెండ్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. విచిత్రమేమింటే రౌండు రౌండుకు అభ్యర్ధుల ఆధిక్యతలు మారిపోతున్నాయి. ఇటువంటి ఫలితాల సరళి గత ఎన్నికల్లో ఎక్కడా కనబడలేదు. దాంతో అంతిమ ఫలితం ఏమవుతుందో అని పార్టీలు, అభ్యర్ధులతో పాటు ఓటర్లలో కూడా టెన్షన్ పెరిగిపోతోంది.
తక్కువ ఓటింగ్ జరిగిన బెంగుళూరు నగరంలో ఏమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు మందంజలో ఉండగా, కర్నాటక గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి అభ్యర్ధులు దూసుకుపోతున్నారు. దాంతో ఓటర్ల అంతరంగం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల నుండి పోటీ చేసిన ముఖ్యమంత్రి శిద్దరామయ్య వెనకంజలో ఉండటం విచిత్రంగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రముఖుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు కూడా వెనకబడ్డారు. ఇక, గాలి సోదరులు, ముఖ్యమంత్రి అభ్యర్ధి శ్రీరాములుతో పాటు ఆయన వర్గం బళ్ళారి లాంటి చోట్ల ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. అయితే, బాదామిలో స్వయంగా శ్రీరాములు మాత్రం వెనకబడ్డారు.
కర్నాటకలోని మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్, జెడిఎస్ అభ్యర్ధులు ఆధిక్యతలో ఉన్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్ధులు దాదాపు వెనకబడే ఉన్నట్లు కనబడుతోంది. శికారిపురలో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధి యడ్యూరప్ప ముందంజలో ఉన్నారు. సెంట్రల్ కర్నాటక, కోస్టల్ కర్నాటక, ముంబై కర్నాటక, హైదరాబాద్ కర్నాటక ప్రాంతాల్లో బిజెపి అభ్యర్ధులు మందంజలో ఉన్నారు. జెడిఎస్ నేత కుమారస్వామి రామనగర నియోజవర్గంలో స్పష్టమైన ఆధికత్యతో ఉన్నారు.
హంగ్ తప్పదా ?
అందరూ ఊహించినట్లే కర్నాటకలో ఆధిక్యతల సరళిని గమనిస్తుంటే హంగ్ వచ్చేట్లు కనబడుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో జెడిఎస్ కీలక పాత్ర పోషించనున్న విషయం అర్ధమైపోతోంది. దాంతో ఇటు కాంగ్రెస్, అటు బిజెపిల కీలక నేతలు జెడిఎస్ తో మంతనాలు మొదలుపెట్టినట్లు సమాచారం. కాకపోతే కాంగ్రెస్, బిజెపిల తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా ప్రచారంలో ఉన్న శిద్ధరామయ్య, యడ్యూరప్పలకు మద్దతిచ్చే ప్రశ్నే లేదని ఇప్పటికే కుమారస్వామి స్పష్టం చేయటంతో ఆయా పార్టీల్లో ఆశావహులు కూడా పెరిగిపోతున్నారు. ఆధిక్యతలు రౌండు రౌండుకు మారిపోతుండటంతో అంతిమ ఫలితాలు వెలువడేందుకు బాగా టైం పట్టేట్లే కనబడుతోంది.