కర్నాటకలో రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఫలితాల సరళి సమయంలో మ్యాజిక్ ఫిగర్ దాటినట్లు కనిపించిన బీజేపీ.. చివరకు వచ్చేసరికి మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. దీంతో జేడీఎస్ పాత్ర కీలకమైంది. ఎలాగైనా బీజేపీని అధికారంలోకి రానీయకూడదనుకుంటున్న కాంగ్రెస్.. జేడీఎస్ కు బంపరాఫర్ ఇచ్చింది. 40కి లోపే సీట్లు గెలుచుకున్న జేడీఎస్ చీఫ్ కుమారస్వామికి ఏకంగా సీఎం పదవి ఆఫర్ చేసింది.
కుమరస్వామి దశ తిరిగింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి కన్నడ పీఠాన్ని బీజేపీకి వెళ్లకుండా చేసేందుకు ప్లాన్ చేసింది. 80కి పైగా సీట్లు సాధించి తాము రెండో స్థానం దక్కించుకున్నా... ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించకుండా.. ఆ పదవిని జేడీఎస్ కు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కాంగ్రెస్ ఆఫర్ కు జేడీఎస్ అధినేత కుమారస్వామి కూడా స్వాగతించారు. దీంతో ఇరు పార్టీలూ కలిసి కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నాయి.
ఎన్నికలకు ముందు నుంచి ఊహిస్తున్నట్టుగానే జేడీఎస్ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమైంది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా నెంబర్ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఈ సిచ్యుయేన్ ను గమనించిన కాంగ్రెస్.. వ్యూహాత్మకంగా ముందుగానే రంగంలోకి దిగి జేడీఎస్ తో మంతనాలు జరిపింది. ఏకంగా సోనియాగాంధీ రంగంలోకి దిగి.. జేడీఎస్ తో చర్చలు జరిపింది. జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తే తాము మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది.
ఇది జేడీఎస్ ఊహించని పరిణామం. గత ఎన్నికలతో పోల్చితే కాస్త బలపడినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం జేడీఎస్ కు రాలేదు. దీంతో కనీసం కింగ్ మేకర్ పాత్ర ఖాయమని ఆ పార్టీ అంచనా వేసింది. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో ఏకంగా కింగ్ అవతారమెత్తేందుకు సిద్దమైంది. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానీయకూడదన్న కాంగ్రెస్ ఆలోచన జేడీఎస్ కు వరంలా మారింది. మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై జేడీఎస్ భవితవ్యం ఆధారపడి ఉంది.