మన దేశంలో ఫ్లైఓవర్ లు కూలిన ఘటనలు మనం చూసాము. వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కూలిన ఫ్లైఓవర్ ఉదంతంతో అక్కడి ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. అది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో బిజెపి పై అలానే ఆయనపై విమర్శల దాడి మొదలయింది.
పాత రైల్వే స్టేషన్ వద్ద రూ.129కోట్ల రూపాయల ఖర్చుతో, దాదాపు 2261 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రభుత్వం మొదలెట్టింది. కాగా ఇప్పటికే పనులు ఊపందుకున్న ఈ ఫ్లైఓవర్, పనులు జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా నేడు కుప్పకూలింది.ఈ దుర్ఘటనలో ఒక మినీ బస్సు, నాలుగు కార్లు, దాదాపు పన్నెడు దాకా టూ వీలర్లు ధ్వంసం అయ్యాయని, అంతేకాక దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దుర్ఘటన ప్రాంతాన్ని సందర్శించి యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనపై బాధ్యతవహిస్తూ చనిపోయిన వారి కుంటుంబాలు సానుభూతి తెలిపారు.
కాగా ఈ ఘటనలో గాయాలపాలయిన వారికి రూ.2 లక్షలు, చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. నిర్మాణపనుల్లో పాల్గొంటున్న ఆ ప్రాజెక్టు చీఫ్ మేనేజర్, మరియు ముగ్గురు ఇతర సిబ్బందిని వెంటను విధులనుండి తొలగించారు. ప్రమాద కారణాలను విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఓ కమిటీని నియమించింది.
బుధవారం ఉదయం కమిటీ సభ్యులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కమిటీలో సభ్యునిగా ఉన్న రాజ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. విచారణ పూర్తి కానిదే ఏ విషయం చెప్పలేమని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరపకుండా ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు.
మరోవైపు మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిందని, ప్రాజెక్టు పనుల్లో నాసిరకమైన ఇసుక, సిమెంటు, ఇనుము మరియు ఇతర సామగ్రిని వాడుతున్నారని, ఘటనలో చనిపోయిన ప్రజలకు మోడీ బాధ్యతవహించాలని ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.