కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించనున్నా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ నియమించిన తర్వాత ముద్రగడ స్వయంగా వెళ్ళి కన్నాను కలిసారు. వారిద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నట్లు బిజెపి వర్గాలు చెప్పాయి.
ముద్రగడ-కన్నా ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందిన నేతలే కావటంతో పాటు వారిద్దరి మధ్య ఎప్పటి నుండో సన్నిహితం కూడా ఉంది. అందుకనే తమ భేటీ సందర్భంగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు ఫోన్ చేసి ముద్రగడతో మాట్లాడించినట్లు సమాచారం. వారి చర్చల్లో బిజెపికి తమ పూర్తి మద్దతుంటుందని అమిత్ షా కు ముద్రగడ హామీ ఇచ్చారని సమాచారం.
ముద్రగడ బిజెపిలో చేరుతారా
కన్నా-ముద్రగడ భేటీ
కన్నా-ముద్రగడ భేటీ తర్వాత ఈ విషయమై పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కాపు నేతల సమాచారం ప్రకారం ముద్రగడ పద్మనాభం భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఇప్పటికైతే లేనట్లే. ముద్రగడ గనుక బిజెపిలో చేరితే సామాజికవర్గపరంగా కూడా ఉపయోగాలుంటాయని పలువురు భావిస్తున్నారు.అయితే తాను బిజెపిలో చేరే ఉద్దేశ్యంలో లేనట్లు ముద్రగడ చెబుతున్నారు. గతంలోనే ముద్రగడ బిజెపిలో పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో నాయకత్వంతో పడకే బిజెపిలో నుండి వచ్చేశారట. కాబట్టి ఇప్పటికిప్పుడు మళ్ళీ బిజెపిలో చేరే అవకాశాలైతే తక్కువే అని తెలుస్తోంది.
వెలుపలి నుండే మద్దతు ?
బిజెపిలో చేరేకంటే వెలుపలి నుండి మద్దతు ఇవ్వటమే అన్ని విధాల మంచిదని ముద్రగడ యోచిస్తున్నారట. కన్నాతో ఉన్న సంబంధాల కారణంగా రేపటి ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి వీలైనన్ని టిక్కెట్లు ఇప్పించుకోవాలని ముద్రగడ యోచిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా కాపు సామాజిక మద్దతును ముద్రగడ బిజెపికి అందించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో సంగతి పక్కన పెట్టినా ఉభయగోదావరి జిల్లాల్లోని కాపు సామాజికవర్గంలో ముద్రగడ మాట కొంచెం చెల్లుబాటవుతుందనే చెప్పాలి.
జనసేన మాటేమిటి
ముద్రగడ మద్దతు సంపాదించే ఉద్దేశ్యంతోనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొంత కాలం క్రితం ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం. తన మేనమామను ముద్రగడ వద్దకు పవన్ స్వయంగా రాయబారం పంపారు. జనసేనతో కలిపి పనిచేస్తే పార్టీ ఉద్యమం మరింత బలోపేతమవుతుందని పవన్ మేనమామ ముద్రగడకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ముద్రగడ ఆ ప్రతిపాదనను అప్పట్లో సున్నితంగా పక్కన పెట్టేశారు. మరి అదే పనిగా ఇపుడు కన్నాను కలసి చర్చలు జరపటంలో ముద్రగడ ఆంతర్యం పూర్తిగా అర్ధం కావటం లేదు. మొత్తం మీద బిజెపిలో చేరే సంగతిని పక్కన పెట్టేసినా వచ్చే ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా నిలవాలని మాత్రం నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతోంది.