కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే సంబరాలు చేసుకున్నారు. దుపరి ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి పదవీబాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘ప్రజాస్వామ్యం గెలిచింది. కర్ణాటక ప్రజలకు అభినందనలు. దేవెగౌడ జీ, కుమారస్వామి జీ, కాంగ్రెస్, ఇతరులకు అభినందనలు. రీజనల్ ఫ్రంట్ సాధించిన విజయం ఇది’ అని మమత తన ట్వీట్ లో పేర్కొంది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ‘పిరికితనం, అవినీతి, అబద్ధాలతో పాటు అపవిత్ర రాజకీయాలకు పాల్పడిన వారిపై ఎట్టకేలకు ప్రజాస్వామ్యం విజయం సాధించింది. కర్ణాటక ప్రజలకు అభినందనలు!’ అని సంతోషం వ్యక్తం చేసింది. బీజేపీ అక్రమ నిర్బంధంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శాసనసభకు వచ్చే అవకాశం దొరికిన తర్వాత వారు తిరిగి కాంగ్రెస్కు మద్దతు పలికారన్నారు. సుప్రీంకోర్టు సదర్భానికి అనుగుణంగా నిలిచిందన్నారు.
కర్ణాటక గవర్నర్ రెండు వారాల గడువు ఇచ్చి, కాంగ్రెస్ను చీల్చేందుకు అవకాశం ఇచ్చారన్నారు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యానికికే ప్రజలు మద్దతు ఇస్తారని మమతా బెనర్జీ అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం కూడా తన సంతోషం వ్యక్తం చేశారు. ‘అయ్యో! మిస్టర్ యడ్యూరప్ప. ఎప్పుడైతే కీలుబొమ్మలనాడించే వారు విఫలమవుతారో, అప్పుడు ఆ కీలు బొమ్మ కింద పడి పగిలిపోతుంది’ అని బీజేపీని విమర్శిస్తూ ఈ ట్వీట్ చేశారు.