కడప జిల్లాలో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి చుట్టూ ఉచ్చు బాగానే బిగుసుకుంటోంది. బిగుసుకుంటున్న ఉచ్చు కూడా ప్రధాన ప్రతిపక్షం వైసిపి వల్ల కాదు. సాక్ష్యాత్తు సొంతపార్టీ నేతలే బిగిస్తుండటం గమనార్హం. దాంతో జమ్మలమడుగులో అసలు మంత్రికి టిక్కెట్టు వస్తుందా వచ్చినా గెలుస్తారా అన్న విషయంపై టిడిపిలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఫిరాయింపు మంత్రి ప్రస్తుత పరిస్ధితి ఒకరకంగా స్వయంకృతమే అని చెప్పుకోవాలి. ఫలితంగా మంత్రికి జిల్లాలో శతృవులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఒకవేళ ఆది శతృవులంతా నిజంగా ఏకమైతే టిక్కెట్టు వచ్చినా గెలుపు మాత్రం అంత ఈజీ కాదన్న విషయం అర్ధమైపోతోంది.
మంత్రిపై వ్యతిరేకత
జిల్లా సంగతిని పక్కనపెడితే నియోజకవర్గమైన జమ్మలమడుగులోనే మంత్రికి బలమైన ప్రత్యర్ధున్నారు. ఆవిర్భావం నుండి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న రామసుబ్బారెడ్డికి మంత్రికి ఉప్పు-నిప్పన్న సంగతి అందరికీ తెలిసిందే. లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసిన ఆదినారాయణ రెడ్డి వైసిపిలో చేరారు. ఎన్నికల్లో రామసుబ్బారెడ్డిని ఎదుర్కొని గెలిచారు. అయితే గెలిచిన కొంత కాలానికే వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించారు. ఆది టిడిపిలోకి రావటాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినా ఆపలేకపోయారు. దానికితోడు టిడిపిలోకి ఫిరాయించటమే కాకుండా ఆది నారాయణరెడ్డి ఏకంగా మంత్రికూడా అయిపోయారు. దాంతో వారిద్దరి మధ్య వివాదాలు ఎప్పటికప్పుడు రోడ్డున పడుతూనే ఉన్నాయి. వారిద్దరి మధ్యా చంద్రబాబు మధ్యస్ధం చేద్దామని ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు.
జిల్లాపై పెత్తనం
తాను వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించటం టిడిపిలోని నేతల్లో ఎవరికీ ఇష్టం లేదన్న విషయం ఆది నారాయణరెడ్డికి బాగా తెలుసు. అయితే టిడిపి నేతల్లో ఎవరికివ్వాల్సిన గుర్తింపుమర్యాద వారికివ్వాలన్న విషయాన్ని ఫిరాయింపు మంత్రి మరచిపోయారు. పైగా ప్రతిఒక్కరితోను గొడవలు పెట్టుకుంటున్నారు. ఆది టిడిపిలోకి ఫిరాయించటానికి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేషే కారణం. అటువంటిది ఇపుడు రమేష్ తో ఆదికి ఏమాత్రం పడటంలేదు. అదే సమయంలో నియోజకవర్గంలోని రామసుబ్బారెడ్డితో సంబంధాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రొద్దుటూరులో మాజీ ఎంఎల్ఏ వరదరాజుల రెడ్డి కమలాపురం మాజీ ఎంఎల్ఏ వీర శివారెడ్డితో కూడా ఆదికి పడటం లేదు. అంటే టిడిపిలోని కీలక నేతల్లో ఎక్కువమందితో ఆదికి ఏమాత్రం పడటం లేదన్న విషయం అర్ధమైపోతోంది.
శతృవులేకమైతే
రాబోయే ఎన్నికల్లో జమ్మలమడుగులో పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తానే పోటీ చేస్తానంటూ ఫిరాయింపు మంత్రి పదే పదే ప్రకటిస్తున్నారు. మంత్రి ప్రకటనలతో మిగిలిన నేతలకు ఒళ్ళు మండిపోతోంది. దాంతో ఆదిపై మిగిలిన నేతలు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. పార్టీ ఫిరాయించేటపుడు ఆది-చంద్రబాబుల మధ్య ఒప్పందమేంటో ఎవరికీ తెలీదు. కాకపోతే ఆది ప్రకటనలను బట్టి వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపు మంత్రికే టిక్కెట్టు రావటం ఖాయమనే అనుకోవాలి. మరి అదేగనుక నిజమైతే ఫిరాయింపు మంత్రి టిక్కెట్టు వరకూ తెచ్చుకోగలిగినా గెలుపు సంగతేంటి పార్టీలోని శతృవులందరూ ఆది నారాయణరెడ్డికి వ్యతిరేకంగా ఏకమైతే మంత్రి ఏం చేస్తారు అన్న విషయంపైనే పార్టీలోని మిగిలిన నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
వైసిపి సంగతేంటి
వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపు మంత్రికి డిపాజిట్లు కూడా రాదని వైసిపి నేతలంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వల్లే ఆది గెలిచినట్లు వైసిపి నేతలు ఫిరాయింపు మంత్రిని ఎద్దేవా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే వైసిపిలో నుండి టిడిపిలోకి ఆది ఫిరాయించారో అప్పటి నుండే డౌన్ ఫాల్ స్టార్టయిందన్నది వైసిపి నేతల వాదన. అసలే ఆదిపై నియోజకవర్గంలో వ్యతిరేకతుంది. దానికి తోడు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత. బోనస్ గా టిడిపి నేతలతో శతృత్వం. ఇటువంటి నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి గెలుపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.