కర్నాటక రాజకీయాలు మళ్ళీ వేడుక్కుతున్నాయ్. నాలుగు రోజుల క్రితమే ముఖ్యమంత్రిగా బలనిరూపణలో బోర్లా పడిన బిజెపి తాజాగా స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్ధితో నామినేషన్ వేయించింది. ఇపుడీ అంశమే రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గెలుచుకునేందుకు తగినంత బలం లేకపోయినా బిజెపి ఏ ధైర్యంతో స్పీకర్ గా తన ఎంఎల్ఏతో నామినేషన్ వేయించిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. బలం నిరూపించుకోలేకే సిఎంగా యడ్యూరప్ప పదవి నుండి దిగిపోయారు. సిఎంగానే బలాన్ని నిరూపించుకోలేకపోయిన బిజెపి మళ్ళీ స్పీకర్ ఎన్నికలో నామినేషన్ వేయటంలో ఆంతర్యమేంటి ? అంటే మళ్ళీ బేరసారాలకు దిగటమే బిజెపి లక్ష్యమా ? ఈ విషయంపైనే చర్చలు జోరందుకున్నాయి. మూడు రోజుల క్రితం సిఎంగా జెడిఎస్ అధినేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కుమారస్వామి కూడా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సుటుంది. సరే, కూటమికి బలం ఉంది కాబట్టి ప్రస్తుతానికి బలనిరూపణలో గట్టెక్కవచ్చు. కాంగ్రెస్, జెడిఎస్ కూటమికి 116 మంది ఎంఎల్ఏల మద్దతుండగా, బిజెపికి 104 ఎంఎల్ఏల మద్దతుంది.
స్పీకర్ పదవికి పోటీ తప్పదా ?
స్పీకర్ పదవికి బిజెపి తరపున సురేష్ కుమార్ నామినేషన్ వేయగా, కాంగ్రెస్, జెడిఎస్ కూటమి తరపున రమేష్ కుమార్ నామినేషన్ వేశారు. ఎప్పుడైతే బిజెపి తన ఎంఎల్ఏతో నామినేషన్ వేయించిందో వెంటనే అధికార కూటమి అప్రమత్తమైంది. తన ఎంఎల్ఏల ఓట్లను జాగ్రత్త చేసుకోవటానికి చర్యలు మొదలుపెట్టింది. ఒక్క ఓటు కూడా బిజెపికి పడకుండా జాగ్రత్త పడింది. బలనిరూపణలో యడ్యూరప్పను గట్టెక్కించుకునేందుకు బిజెపి నేతలు చేయని ప్రయత్నాలు లేవు. ఒక్కో ఎంఎల్ఏకి సుమారు రూ. 100 కోట్ల దాకా ఆఫర్ చేశారని జరిగిన ప్రచారం అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇపుడు కూడా అటువంటి ప్రయత్నాలే బిజెపి మొదలుపెడుతుందని అధికార కూటమి అనుమానిస్తోంది.
బిజెపి అభ్యర్ధి గెలిస్తే ఏమవుతుంది ?
కాంగ్రెస్, జెడిఎస్ కూటమి అధికారంలో ఉన్న కర్నాటక అసెంబ్లీలో బిజెపి తరపున స్పీకర్ ఉంటే ఇంకేమన్నా ఉందా ? అధికార కూటమి కొంప కొల్లేరే అనటంలో సందేహమే అవసరం లేదు. అసెంబ్లీ సమావేశాలు జరిగేటపుడు ప్రతీ రోజు సభలో రచ్చ రచ్చే. ఎందుకంటే, అధికార కూటమికి, బిజెపికి సంఖ్యా బలంలో పెద్దగా తేడా లేదు. రెండింటి మధ్య తేడాను పక్కన పెట్టినా కుమారస్వామికే తగినంత బలం లేదు. బల నిరూపణకు కుమారస్వామికి 112 ఎంఎల్ఏల మద్దతు అవసరమైతే కూటమికున్న బలం 115. అంటే అవసరమైన బలం కన్నా ఉన్నది కేవలం ముగ్గరు ఎంఎల్ఏల మద్దతు మాత్రమే. అంటే, నలుగురు ఎంఎల్ఏలు గనుక ప్లేట్ మర్చేస్తే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. అందుకనే అధికార కూటమిలో ఆందోళన మొదలైంది.
లింగాయత్ ఎంఎల్ఏలకు బిజెపి గాలం ?
కర్నాటక అసెంబ్లీలో లింగాయత్ ఎంఎల్ఏలే చాలా కీలకం. అన్నీ పార్టీల్లో కలిపి 222 ఎంఎల్ఏలకు గాను లింగాయత్ ఎంఎల్ఏలే సుమారు 90 మంది దాకా ఉన్నారు. వీరిలో బిజెపిలో 40 మంది దాకా ఉంటే మిగిలిన ఎంఎల్ఏలు కాంగ్రెస్, జెడిఎస్ తరపున గెలిచారు. ఇపుడు బిజెపి దృష్టంతా అధికార కూటమిలోని లింగాయత్ ఎంఎల్ఏలపైనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా లింగాయత్తే కాబట్టి అధికార కూటమిలోని లింగాయత్ ఎంఎల్ఏలను ఆకర్షించటం పెద్ద కష్టమేమీ కాదని ప్రచారం జోరుగా సాగుతోంది. సిఎంగా బల నిరూపణ చేసుకోలేకపోయారంటే సుప్రింకోర్టు అప్పట్లో ఎక్కువ సమయం ఇవ్వలేదు కాబట్టి యడ్యూరప్ప దెబ్బతిన్నారు. స్పీకర్ గా బిజెపి ఎంఎల్ఏలకు గెలుపు అవకాశాలు తక్కువే. అయితే, ఏదో మాయ చేసి బిజెపి గనుక తన అభ్యర్ధిని గెలిపించుకోగలిగితే కర్నాటక చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే అది సంచలనం అవుతుందనటంలో సందేహం అవసరం లేదు.