జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను చంద్రబాబునాయుడు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు.శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటమ్ విషయంలో చంద్రబాబు వైఖరి వల్లే పవన్ ను ప్రభుత్వం లెక్క చేయటం లేదన్న విషయం అర్ధమవుతోంది. జిల్లాలోని పలాసలో పర్యటిస్తున్న పవన్ కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో కార్యాచరణ రూపొందించేందుకు వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో కమిటి వేయాలని కూడా డిమాండ్ చేశారు. పవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించగానే ఏదో మిన్న విరిగి మీద పడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ పవన్ హెచ్చరికలను ప్రభుత్వ ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా వైద్య ఆరోగ్య శాఖ బాగా పనిచేస్తోందంటూ ఓ సమీక్షలో చంద్రబాబు తేల్చేశారు.
పట్టించుకోవటం మానేశారు
నిజానికి కిడ్నీ సమస్యకు పరిష్కారం ఒక్క రోజులో దొరికేది కాదు. అది దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన సమస్య. అటువంటిది పవన్ అల్టిమేటమ్ ఇవ్వగానే ప్రభుత్వం హడావుడిగా ఈ సమస్య మీదే దృష్టి పెట్టటం సాధ్యం కాదు. ఏదో మిత్రునిగా ఉన్నపుడు పవన్ చెప్పిన మాటలకు, చేసే సూచనలకు చంద్రబాబు వెంటనే స్పందిస్తున్నట్లు నటించేవారు. తూతూ మంత్రంగా చర్యలు తీసుకునే వారు. ఎప్పుడైతే మిత్రుడు కాస్త శతృవుగా మారిపోయాడో అప్పటి నుండే పవన్ ను ప్రభుత్వం పట్టించుకోవటం మానేసింది. అంతేకాకుండా అవకాశం దొరికినపుడల్లా పవన్ పై టిడిపి నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. అటువంటి నేపధ్యంలో కిడ్నీ సమస్యపై పవన్ ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇవ్వటమే తెలివితక్కువ తనం.
పవన్ కార్యాచరణేంటి ?
పవన్ హెచ్చరికలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. మరి పవన్ ఇపుడేం చేస్తాడు అన్నదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ప్రభుత్వ వైఖరికి నిరసనగా దీక్ష చేయటానికి పవన్ పోలీసులను అనుమతడగటమే విచిత్రంగా ఉంది. నిజానికి ఎవరైనా తాము ఆందోళన చేస్తామని, నిరసన తెలుపుతామని అనుమతిమ్మంటే ప్రభుత్వం ఇస్తుందా ? నిరసన తెలపాలనుకున్న వ్యక్తిలో చిత్తశుద్ది ఉంటే హటాత్తుగా నిరసన మొదలుపెట్టాలంతే. తర్వాత ఏదైతే అదవుతుంది.