గత కొన్ని రోజులగా కర్ణాటక రాజకీయంలో ఎన్నో సంచలనాలు జరిగాయి. ఈ నెల 12 న పోలింగ్ జరుగగా..15 న ఫలితాలు వెలువడ్డాయి. అయితే బీజేపీకి 104 సీట్లు రాగా..కాంగ్రెస్ కి 77, జేడీఎస్ కి 38 సీట్లు వచ్చాయి. 104 సీట్లు వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్ వద్దకు వెళ్లిన సమయంలో అనూహ్యంగా కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకోవడం వీరి సంఖ్యాబలం పెరగడంతో వివాదం మొదలైంది. అయితే నాటకీయ పరిణామాల మద్య బీజేపీ అభ్యర్థి యడ్యూరప్పతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ వివాదం కాస్త సుప్రీం కోర్టు వద్దకు వెళ్లడంతో రెండు రోజుల బీజేపీ బలనిరూపణ చేయాల్సిందిగా తెలపడంతో అసెంబ్లీలో యడ్యూరప్పబలనిరూపణ నిరూపించుకోలేక పోయారు. దాంతో కర్ణాటక సీఎంగా కుమారస్వామి పదవీ బాధ్యతలు చేపట్టారు. నేడు కుమార స్వామి బలనీరుపణ చేసుకోవాల్సి ఉంది. తాజాగా సీఎం కుమార స్వామిపై బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్, జేడీఎస్లది అపవిత్ర పొత్తు అని కర్ణాటక బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప అభివర్ణించారు.
ప్రభుత్వ ఏర్పాటు కోసం కుమారస్వామి దిగజారారని, అధికారం కోసం అర్రులు చాస్తున్న ఆయన రాజ్యాంగ ద్రోహి అని నిప్పులు చెరిగారు.కుమారస్వామితో గతంలో కలిసి పనిచేసినందుకు బాధపడుతున్నానని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. 37 సీట్లు సాధించిన జేడీఎస్ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందంటూ ఆయన ప్రశ్నించారు. 16 జిల్లాల్లో జేడీఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని, అలాంటి పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ఎద్దేవా చేశారు.
అధికారం కోసం రెండు పార్టీలూ దిగజారాయని ఆరోపించారు.కాగా.. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు తాము సహకరిస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చారు. స్పీకర్ ప్రతిపక్షాలకూ అవకాశం ఇస్తారని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా.. బలపరీక్షకు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది.