ఉప ఎన్నికలు వస్తే పోటీ చేయటానికి తెలుగుదేశంపార్టీ నేతలు భయపడుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న చర్యలను చూస్తే ఎవరికైనా అదే అనుమానం వస్తుంది. ప్రత్యేకహోదా డిమాండ్ తో ఐదుగురు వైసిపి ఎంపిలు రాజీనామాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజీనామాల విషయమై మాట్లాడేందుకు ఈనెల 29వ తేదీన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపిలతో భేటీ అవుతున్నారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ కోరుతుండగా, రాజీనామాలను ఆమోదించాల్సిందిగా ఎంపిలు పట్టుపడుతున్నారు. వీరి రాజీనామాలు ఆమోదం పొంది ఉప ఎన్నికలు తప్పవని చంద్రబాబునాయుడే గతంలో తేల్చేశారు. సరే, వీరి రాజీనామాలు ఏమవతాయన్న విషయం పక్కన పెడితే నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఏం చేయాలి అన్న విషయంపై టిడిపిలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. చర్చల సరళిని బట్టి చూస్తుంటే ఉప ఎన్నికల్లో పోటీ చేయటానికి టిడిపి నేతలు వెనకాడుతున్న విషయం స్పష్టమైపోతోంది.
ఉప ఎన్నికల నియోజకవర్గాలు
నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపి వరప్రసాద్, కడప ఎంపి అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపి మిధున్ రెడ్డి రాజీనామాలను ఆమోదిస్తే మళ్లీ అవే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పేట్లు లేవు. ఉప ఎన్నికలు వస్తే వైసిపి నుండి పై అభ్యర్ధులే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఉప ఎన్నికల విషయమై నెల్లూరులో జరిగిన మినీ మహానాడులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బాగా డబ్బు సంపాదించిన ఆదాల ప్రబాకర్ రెడ్డే పోటీ చేయాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేదికపై నుండే చెప్పారు. వెంటనే ఆదాల మాట్లాడుతూ, జిల్లాలో మంత్రులు ఇద్దరున్న కారణంగా వారిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేయటమే ధర్మమంటూ తిప్పి కొట్టారు. అక్కడే ఉన్న మరో మంత్రి నారాయణ మాత్రం బమిరంగంగ ఏమీ మాట్లాడలేదు. నేతల మధ్య చర్చంతా బహిరంగంగానే జరగటం గమనార్హం. కారణాలేవైనా కానీ వీరి చర్చలు చూస్తుంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనకాడుతున్న విషయం అర్ధమైపోతోంది.
మిగితా నియోజకవర్గాల్లో పరిస్ధితేంటి ?
మిగిలిన నియోజకవర్గాలైన కడప, రాజంపేట, తిరుపతి, ఒంగోలులో కూడా పరిస్ధితి కాస్త అటు ఇటుగానే ఉంది. ప్రత్యేకహోదా అన్నది జనాల్లో సెంటిమెంటుగా మారిపోయింది. ఆ సెంటిమెంటును ఆధారం చేసుకునే వైసిపి ఎంపిలు రాజీనామాలు చేశారు. అంతేకాకుండా వెంటనే ఏపి భవన్లో ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చున్నారు. దాంతో వైసిపి ఎంపిలకు జనాల్లో మైలేజీ పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో గడచిన నాలుగేళ్ళు చంద్రబాబు ఆడిన డ్రామాలపై కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పైగా వివిధ కారణాలతో ప్రభుత్వంపై ఒకవైపు జనాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దాంతో ఉప ఎన్నికల్లో పోటీ పై టిడిపి నేతల్లో ఆందోళన కనబడుతోంది.
జగన్ పాదయాత్ర ప్రభావం
అన్నింటికీ మించి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభావం కూడా జనాల్లో బాగా కనబడే అవకాశం ఉంది. ఏ జిల్లాలో అడుగుపెట్టినా జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. జగన్ పాదయాత్ర విషయంలో జనాల స్పందన చూస్తుంటే ప్రభుత్వంపై వారిలో ఏ స్ధాయిలో వ్యతరేకతుందో అర్ధమైపోతోంది. అందులోనూ జగన్ ఇప్పటి వరకూ చేసిన పాదయాత్రలో ఉప ఎన్నికలు జరగాల్సిన జిల్లాలు కవర్ అయింది. దాంతో ఉప ఎన్నికలకు ముందే ఫలితాలు వైసిపికి అనుకూలంగా ఉంటాయని వైసిపి నేతలు సంభరపడిపోతున్నారు. దాంతో టిడిపి నేతల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది.