నరేంద్ర మోదీ.. ప్రస్తుతం భారత్ లో తిరుగులేని నేత. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయింది. ఇంకో ఏడాది మాత్రమే సమయముంది. మరి ఈ నాలుగేళ్లలో మోదీ ప్రజాదరణ పొందారా.. ఆయన సంస్కరణలు సత్ఫలితాలిచ్చాయా..? మోదీ వస్తే రాతలు మారతాయని భావించిన ప్రజల బతుకులు మారిపోయాయా..?
నాలుగేళ్ల క్రితం మోదీ అంటే భారతదేశంలో ఓ ప్రభంజనం. ఆధునికతరం ఆశలకు, ఆశయాలకు ఆ పేరో అస్త్ర సమానం. మార్పు కోరుకుంటున్న దేశవాసులకు ఆయన అందివచ్చిన వరం. మోదీ గుజరాత్ సీఎం పోస్టు నుంచి దేశ ప్రధానిగా ఎన్నిక కావటాన్ని కోట్లాది హృదయాలు అత్యుత్సాహంతో సమర్థించాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. దశాబ్ధకాలం కొనసాగిన కాంగ్రెస్ మార్కు పాలన నుంచి మార్పు కావాలని గట్టిగా అభిలషించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓ గొప్ప మార్పు దిశగా తొలి అడుగులు వేస్తోందన్న ఉద్విగ్న క్షణాల్ని మోదీ రాకతో అనుభూతి చెందారు.
నరేందర్ దామోదర్ దాస్ మోదీ.. 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసి, సీఎం సీటు నుంచే నేరుగా పీఎం పీఠానికి ఎగబాకిన నేత. భారత దేశ చరిత్రలో ఎవ్వరూ సాధించలేని ఘనత 2014లో మోదీ సొంతం చేసుకున్నారు… గుజరాత్ సీఎంగా ఉంటూ ఆయన అమలు చేసిన పథకాలు.. వైబ్రాంట్ గుజరాత్ అంటూ దేశ-విదేశీ పెట్టుబడుల్ని సాధించిన వైనం దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆయనకు ముందు.. ఆ తర్వాత కూడా భారతదేశంలో ఏ రాష్ట్రముఖ్యమంత్రికీ రానంత క్రేజ్ సాధించిపెట్టింది… గుజరాత్ రాష్ట్రంలో 2002, 2007, 2012.. ఇలా వరుస ఎన్నికల్లో బీజేపీని గెలుపుబాట పటిస్తూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ ను సుదీర్ఘకాలం అదే పొజిషన్ లో ఫిక్స్ చేయటంలో మోదీ సాధించిన విజయపరంపర.. 2014లో కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అంటూ బీజేపీ జాతీయ స్థాయి ఎన్నికల నినాదంగా మారిపోయింది…
2014 సార్వత్రిక ఎన్నికల ప్రచార సారధిగా బీజేపీ మోదీ పేరు ప్రకటించగానే.. అనేక మంది నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. స్వయంగా మోదీ రాజకీయ గురువు అద్వానీ సైతం ఆక్షేపించారు. అవేవీ మోదీ ఛరిష్మా ముందు నిలబడలేదు. భారత ప్రధానమంత్రిగా ఆయన ప్రస్థానాన్ని అడ్డుకో లేకపోయాయి. 2004-14 మధ్య పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన యూపీఏ టూ ప్రభుత్వం ఎంతగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందో.. మోదీ అంతగా తన పాపులార్టీని పెంచుకున్నారు. కాంగ్రెస్ మంత్రుల అవినీతిని నేరుగా నిలదీస్తూ., ప్రధాని రేసులో తనకు పోటీ లేకుండా చేసుకున్నారు…
మోదీ పరివార్ నేపథ్యం భారతదేశంలో ఆయన పాపులార్టీని అనూహ్యంగా, అతి తక్కువ కాలంలోనే శిఖరస్థాయికి చేర్చేసింది. వాజ్ పేయి తర్వాత కమలదళంలో ఓ కార్యకర్తకు అంతటి అపూర్వ ఆదరణ మరెవ్వరీ దక్కలేదంటే అతిశయోక్తి కాదు. స్వయానా మోదీ రాజకీయ గురువు, బీజేపీ బీష్ముడిగా ప్రసిద్ధి చెందిన అద్వానీ విషయంలో కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.., మోదీ విషయంలో రోజు రోజుకూ ఆయనతో విభేదించేవారు తెరమరుగయ్యారు. బీజేపీ అంటే మోదీ.. మోదీ అంటే బీజేపీ అనే స్థాయి అనతికాలంలో సాధించారు…
బీజేపీలో అగ్రనాయకుడిగా మోదీ ప్రభ., దేశంపై ఎంతటి ప్రభావం చూపిందంటే.., ఆ పార్టీ సంప్రదాయ ఎన్నికల అస్త్రాలైన ఆర్టికల్ 370, అయోధ్యల ఊసెత్తకుండానే ఆయన 2014 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 72 ఎంపీ సీట్లను కొల్లగొట్టారు. రాముడి పేరు ఎత్తకుండా రామజన్మభూమిలో పాగా వేశారు. బీజేపీని అభివృద్ధి నినాదంతో కూడా గెలిపించగలను అని తొలిసారి నిరూపించారు. అదీ అప్పుడు మోదీకున్న ఇమేజ్. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి..?