రాజధాని భూములకు సంబంధించి చంద్రబాబునాయుడు ప్రభుత్వం మరో వివాదాస్పదమైన నిర్ణయాన్ని తీసుకుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఈ విషయమై పలు స్వచ్చంధ సంస్ధలు, నిర్మాణ సంస్ధలు హై కోర్టులో కేసులు వేయటంతో కోర్టు ప్రభుత్వానికి బాగా తలంటిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు వెనకాడకుండా తాను అనుకున్నట్లే ముందుకు పోవాలని నిర్ణయించుకోవటం బాగా వివాదాస్పదమైంది. ఇంతలోనే రాజధాని భూములకు సంబంధించి చంద్రబాబు మరో వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం రాజధాని కోసమంటూ రైతుల నుండి సేకరించిన వేలాది ఎకరాలపై పెత్తనాన్ని సింగపూర్ లోని ప్రైవేటు సంస్ధలకు కట్టబెట్టేశారట.
రాజధాని భూములపై పవర్ ఆఫ్ అటార్నీనా ?
ఇంతకీ విషయం ఏమిటంటే, రైతుల నుండి సేకరించిన సుమారు 35 వేల ఎకరాలపై పూర్తి పెత్తనాన్ని చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు రాసిచ్చేసిందట. అంటే భూముల వాడకంపై సింగపూర్ కంపెనీలకే పవర్ ఆఫ్ అటార్ని రాసిచ్చేసింది. ఈ విషయంలో భూములు ఇచ్చిన రైతులు గానీ లేకపోతే ఏ సంస్ధలు లేదా రాబోయే ఏ ప్రభుత్వం కూడా ప్రశ్నించేందుకు వీల్లేకుండా న్యాయపరమైన జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే పవర్ ఆఫ్ అటార్నీ తయారు చేసిందట. ఈ విషయంలో కొందరు ఉన్నతాధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా సిఆర్ డిఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సంతకంతో ప్రభుత్వం జీవో 168 జారీ చేయటం గమనార్హం.
ఇప్పటికే 1681 ఎకరాలకు మంగళం ?
స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో ఇప్పటికే రాజధాని ప్రాంతంలో విలువైన 1681 ఎకరాలను కట్టపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు కూడా ఎన్ని వివాదాలు రేగినా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయలేదు. విచిత్రమేమిటంటే మొత్తం ప్రాజెక్టులో సింగపూర్ పెట్టుబడి రూ. 338 కోట్లైతే ప్రభుత్వం మాత్రం మౌళిక సదుపాయాలు తదితరాలకు రూ. 5 వేల కోట్లు వ్యయం చేస్తోంది. స్విస్ చాలెంజ్ లో పాల్గొన్న సింగపూర్ కంపెనీలు అభివృద్ధి-రాయితీ, షేర్ హోల్డర్స్ ఒప్పందాలపై ఎక్కడా ఒక్క సంతకం కూడా చేయలేదు. అయినా ఏపి ప్రభుత్వం మాత్రం గుడ్డిగా సింగపూర్ కంపెనీలకే మొత్తం భూములను రాసిచ్చేస్తోంది. అంతేకాకుండా వాళ్ళు ఆడమన్నటల్లా ఆడుతోంది. అందుకే భవిష్యత్తులో సింగపూర్ కంపెనీలకు కానీ లేదా చంద్రబాబు కానీ ఎటువంటి సమస్యలు రాకుండా వివాదాలన్నింటినీ లండన్ కోర్టుల్లో మాత్రమే తేల్చుకోవాలంటూ షరతును కూడా పెట్టంది.
నిబంధనలన్నీ సింగపూర్ కే అనుకూలమా ?
ఒకదేశంలో వీదేశీ కంపెనీలేవైనా ప్రాజెక్టులు చేపట్టాలంటే కచ్చితంగా ఆదేశంలోని నిబంధనలను అంగీకరించాల్సిందే. ప్రాజెక్టులోని నియమ, నిబంధనలన్నీ కూడా ఆ దేశానికి అనుకూలంగా ఉండేట్లే చూసుకుంటాయి. అందుకు విదేశీ కంపెనీలు ఒప్పుకుంటేనే ప్రాజెక్టు ముందుకెళుతుంది. కానీ ఏపిలో మాత్రం చంద్రబాబు విరుద్ధంగా నడుచుకుంటున్నారు. సింగపూర్ కంపెనీలకు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలనే పణంగా పెడుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. తనపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా ఏమాత్రం ఖాతరుచేయకుండా ఎదురుదాడి చేస్తూనే చంద్రబాబు తాను అనుకున్నట్లే ముందుకు సాగుతున్నారు. అసలు సింగపూర్ సంస్ధలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని బయటపెట్టాలని ఎంతమంది అడుగుతున్నా ఇంత వరకూ చంద్రబాబు బయటపెట్టలేదు. అందుకే అందరిలోనూ అనుమానాలు వస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే వచ్చే ఎన్నికల వరకూ ఆగాల్సందే.