ఏదో ఓ రంగంలో గొప్పవాడు అనిపించుకోవాలంటే ఎన్ని దశాబ్దాలు కృషి చేస్తే సాధ్యమవుతుంది ? జన్మంతా తల్ల క్రిందులుగా కష్టపడినా చాలా మందికి సాధ్యం కాదు. అటువంది ఒక రంగంలో అత్యున్నతస్ధాయికి చేరుకుని వెంటనే ఇంకో రంగంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా చరిత్ర సృష్టించారంటే అటువంటి వ్యక్తిని ఏమనుకోవాలి. మూడే మూడక్షరాలు అదేనండి ఎన్టీఆర్. అంటే నందమూరి తారక రామారావు అనే అనుకోవాలి. ఇపుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మే 28వ తేదీ అన్నగారి 96వ జయంతి కాబట్టి. యావత్ దేశం సంగతిని పక్కనపెట్టినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎన్టీవోడనే అనుకుంటారు జనాలు. వెండితెర ఇలవేల్పుగా, రారాజుగా కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఎన్టీఆర్ చిత్రసీమను దాదాపు 40 ఏళ్ళపాటు ఎదురులేకుండా ఏలారనే చెప్పుకోవాలి. చారిత్రాత్మక చిత్రాల్లో నటించి చరిత్ర పురుషునిగా, పౌరాణిక సినిమాల్లో నటించి పురాణ పురుషునిగా, సాంఘిక చిత్రాల్లో నటించి ప్రతీ ఇంట్లోను ఓ అన్నగా జనహృదయాల్లో నిలిచిపోయారు. అంతటి అభిమానం సంపాదించుకున్నారు కాబట్టే రాజకీయాల్లోకి ప్రవేశించగానే దేశంలోనే ఓ చరిత్ర సృష్టించగలిగారు.
నాటకాల ప్రేరణతోనే సినిమాల్లోకి
1923, మే 28వ తేదీన కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలోని నిమ్మకూరులో ఎన్టీఆర్ జన్మించారు. విద్యాభ్యాసమంతా గుడివాడలోను, విజయవాడ, గుంటూరులోనే జరిగింది. విద్యార్ధిదశలొనే నాటకాలపై ఉన్న ఆశక్తితో పలు నాటకాల్లో నటించారు. చదువైపోయిన తర్వాత విజయవాడ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చినా వదిలేసి నాటకాలపైనే దృష్టి పెట్టారు. అయితే, నాటకాల్లో నటించినంత మాత్రానా ఉపయోగం లేదన్న మిత్రుల సలహతో సినిమాల్లో ప్రయత్నాలు చేసుకునేందుకు విజయవాడ నుండి వెంటనే మద్రాసుకు మకాం మార్చేశారు. మొదట్లో కొంతకాలం అవస్తలు పడినా దర్శుకుడు ఎల్వీ ప్రసాద్ దృష్టిలో పడ్డారు. దాంతో 1949 ఎల్వీ దర్శకత్వం వహించిన మనదేశం సినిమాలో తొలిసారిగా వెండితెరపై కనిపించారు. తర్వాత చిన్నా చితకా వేషాలు వేస్తున్నపుడే ప్రముఖ నిర్మాణ సంస్ధ విజయ సంస్ధ 1951లో నిర్మించిన పాతాళ భైరవిలో హీరీ అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో ఎన్టీఆర్ కు వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు.
వరుస హిట్లు
పాతాళభైరవి సినిమా హిట్ అయిన వెంటనే మల్లీశ్వరి, మాయాబజార్ లాంటి జానపదాలు, పౌరాణికాలతో పాటు మధ్యలో సాంఘీకాలు కూడా బాగా హిట్ అయ్యాయి.దాంతో చిత్రసీమలో ఎన్టీఆర్ స్ధిరపడిపోయారు. చిత్రపరిశ్రమ 40 ఏళ్ళ ప్రస్ధానంలో ఎన్టీఆర్ 300 సినిమాల్లో నటించారు. తన అభిమానులనే కాకుండా సినీ అభిమానులను కూడా ఆలరించిన శ్రీకృష్ణుని పాత్రను 17 సినిమాల్లో పోషించారు. శ్రీరామచంద్రుని పాత్రలో 10 సినిమాల్లో నటించారు. అందుకే ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఎన్నున్నా అభిమానులు, ప్రతీ తెలుగు వాడు గుర్తుంచుకునే పాత్రలు మాత్రం శ్రీకృష్ణుడు, శ్రీరాముడు మాత్రమే. లవకుశలో ఎన్టీఆర్ పోషించిన శ్రీరాముని పాత్ర, మాయాబజారులో పోషించిన శ్రీ కృష్ణుని పాత్రతో పాటు శ్రీ కృష్ణ పాండవియంలో పోషించిన దుర్యోధనుడు పాత్ర ఇప్పటికి, ఎప్పటికీ అజరామరమనే చెప్పాలి.
సాంఘీకాల ప్రభావం
నటించిన సినిమాలు ఎన్నున్నా తాను పోషించిన సాంఘీక చిత్రాల్లోని పాత్రల ప్రభావం మాత్రం ఎన్టీఆర్ పై బాగా ఎక్కువనే చెప్పాలి. బొబ్బిలిపులి, కొండవీటి సింహం, జస్టిస్ చౌధరి సినిమాల ప్రభావంతోనే బహుశా ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించారేమో. పై మూడు చిత్రాలు కూడా 1981-82 మధ్య విడుదలై అఖండి విజయాలు సాధించటంతో ఎన్టీఆర్ రెట్టించిన ఉత్సాహంతో రాజకీయ రంగంలోకి దూకారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకున్నట్లు చెప్పిన ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశంపార్టీని (టిడిపి) ప్రకటించటం అప్పట్లో ఓ సంచలనం. పార్టీని ప్రకటించటమే తడవుగా వెంటనే ప్రచార రధాన్ని ఎక్కేసి 1983లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేశారు. అప్పటి వరకూ రాష్ట్రాన్ని అప్రతిహతంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. 1983లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ మంచి మెజారిటీతో గెలవటం అప్పట్లో దేశంలోనే పెద్ద సంచలనం. పార్టీని ఏర్పాటు చేసిన కేవలం 9 నెలల్లోనే కాంగ్రెస్ ను మట్టి కరిపించి అధికారంలోకి రావటమే పెద్ద చరిత్ర. అంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టటమే ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారన్నమాట.
అన్నీ చరిత్రలే
పార్టీ పెట్టిన 9 నెలల్లోనే టిడిపిని అధికారంలో తేవటం ఓ చరిత్రైతే సిఎం అయిన ఏడాదికే ప్రభుత్వం కూలిపోవటమూ అంతే సంచలనం. అప్పటి నుండి ఎన్టీఆర్ ప్రతీ అడుగూ ఓ సంచలనమే. 1983లో ముఖ్యమంత్రైన ఎన్టీఆర్ 84లో పదవి నుండి దిగిపోవాల్సొచ్చింది. కొందరి వెన్నుపోటు దెబ్బకు పదవిని కోల్పోయిన ఎన్టీఆర్ ప్రజాప్రరిరక్షణ పేరుతో పెద్ద ఉద్యమం నడిపి మళ్ళీ 1984లో మధ్యంతర ఎన్నికల వచ్చేట్లు చేశారు. దాంతో 1984లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అఖండ విజయం సాధించి మళ్ళీ సిఎం అయ్యారు. తర్వాత 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితమైంది. తర్వాత 1994లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైన మెజారిటీతో ముచ్చటగా మూడోసారి సిఎం అయ్యారు. అంటే పార్టీ ఏర్పాటు చేసిన 12 ఏళ్ళల్లో ఎన్టీఆర్ మూడుసార్లు ముఖ్యమంత్రయ్యారు. మూడోసారి సిఎం అయిన ఏడాదికే అంటే 1995లోనే ఎన్టీఆర్ ను కుటుంబసభ్యులే వెన్నుపోటు పొడిచి మళ్ళీ పదవి నుండి దింపేశారు. కుటుంబసభ్యులే తనను వెన్నుపోటు పొడిచారన్న ఆవేదనను తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి 1996, జనవరి 18న మరణించారు.