రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబునాయుడు విచిత్రమైన పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. ఊహించని రీతిలో ఎన్నడూ లేని పరిస్ధితులు వచ్చి మీద పడటంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు ఒంటరైపోయారు. నిజంగా నిజం. పోయిన ఎన్నికల్లో మిత్రులుగా ఉన్న బిజెపి, పవన్ కల్యాణ్ లు వదిలేయటంతో ఒంటరైపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబుతో జత కట్టటానికి ఎవరూ మిగలలేదు.
దాంతో కొత్త మిత్రులను వెతుక్కుందామనుకున్నా చంద్రబాబుకు ఎవరూ కనబడటం లేదు. అందుకే దశాబ్దాల పాటు శతృవుగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపటానికి చంద్రబాబు సిద్ధపడ్డట్లుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు వైఖరి కూడా జరుగుతున్న ప్రచారం నిజమే అన్నట్లుగా కనబడుతోంది. కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహూల్ గాంధితో చంద్రబాబు రాసుకుపూసుకు తిరగటం ప్రచారానికి ఊతమిస్తోంది.
ఎందుకీ పరిస్దితి ?
టిడిపి ఒంటరిగా మిగిలిపోయే పరిస్దితి రావటానికి చంద్రబాబు స్వయంకృతమే కారణమని చెప్పక తప్పదు. అవసరార్ధం పొత్తులు పెట్టుకోవటం, అవసరం తీరిపోగానే ఆ పార్టీని అర్ధాంతరంగా వదిలేయటం చంద్రబాబుకు బాగా అలవాటు. గతంలో తనంతట తానుగా మాజీ ప్రధానమంత్రి అతల్ బీహారీ వాజ్ పేయ్ నాయకత్వంలోని బిజెపితో పొత్తులు పెట్టుకున్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను జరిగిన ఎన్నికల్లో ఓడిపోగానే వెంటనే బిజెపితో పొత్తులు తెగతెంపులు చేసుకున్నారు. పైగా బిజెపిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. మొన్నటి ఎన్నికల్లో కూడా నరేంద్రమోడి క్రేజును గమనించి బిజెపి వెంటపడి పొత్తులు పెట్టుకున్నారు. అయితే వాజ్ పేయికి మోడికి తేడా ఉన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. అందుకనే ఎన్డీఏలో నుండి తనంతట తానుగా బయటకు వెళ్ళేపోయేట్లుగా పొగపెట్టారు. దాంతో బిజెపి రాజకీయాన్ని చంద్రబాబు తట్టుకోలేక తనంతట తానుగా ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు.
మోడితో ప్రత్యక్ష వైరం
ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో ప్రధానమంత్రి నరేంద్రమోడితో ప్రత్యక్షంగానే చంద్రబాబు వైరం పెట్టుకున్నారు. పొత్తులున్నంత కాలం మోడిని, కేంద్రప్రభుత్వాన్ని చంద్రబాబు పల్లెత్తు మాట అనకపోగా పూర్తి మద్దతు పలికారు. అయితే, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ గెలవటం కోసమే బిజెపిని బూచిగా చూపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవటానికి మోడికి వ్యతిరేకంగా ధర్మపోరాటమని, కేంద్రంపై నిరసనని, ఆందోళనలని డ్రామాలాడుతున్నారు. సరే, నాలుగేళ్ళు చంద్రబాబు ఏమి చేశారు ? ఇపుడే హటాత్తుగా ఎందుకు ప్లేటు ఫిరాయించారన్న విషయాలను తెలుసుకోలేనంత అమాయకులు కాదు జనాలు.
చంద్రబాబు భవిష్యత్తేంటి ?
జరుగుతున్న రాజకీయా పరిణామాలను చూస్తున్న వారికి చంద్రబాబు భవిష్యత్తేంటనే ఆశక్తి మొదలైంది. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి అధ్యక్షుడు పాదయాత్ర పేరుతో చంద్రబాబును అన్ని విధాలుగా వాయించేస్తున్నారు. జగన్ పాదయాత్రకు పెరుగుతున్న జనాదరణ చూసి టిడిపిలో ఆందోళన పెరిగిపోతోంది. ఇంకోవైపు బిజెపి, పవన్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలతో దుమ్ము దులిపేస్తున్నారు. దాంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. ఇపుడే చంద్రబాబు పరిస్ధితి ఇలాగుంటే రేపు ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకేమైపోతారో చూడాల్సిందే ?