2008 లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు టీడీపీ నుంచి ప్రజారాజ్యం పార్టీ లోకి ఎలా వలసలు వచ్చాయో మనందరికీ తెలిసిందే. అప్పుడు టీడీపీ చాలా మంది నాయకులను కోల్పోయింది. అయితే సరిగా ఇప్పుడు మరలా అదే సీన్ రిపీట్ కాబోతుందా... అన్న సందేహానికి అవుననే సమాధానాలు వస్తున్నాయి. టీడీపీ లోని కొంత మంది నేతలు జనసేన లోకి జంప్ అయ్యేందుకు సిద్ధముగా ఉన్నారని సమాచారం.
అధికారంలో ఉన్న టీడీపీని వదులుకుని జనసేనలోకి వెళ్లాల్సిన అగత్యం ఏమిటి? అంటే.. టీడీపీ మళ్లీ గెలవదు అనే అభిప్రాయమే గట్టిగా వినిపిస్తోంది. టీడీపీ మళ్లీ గెలవదని ఫిక్సయిన ఎమ్మెల్యేలు, నేతలు పక్కచూపులు చూస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది జగన్తో వైరి పెంచేసుకున్నారు. అలాగే కొన్నిచోట్ల వైకాపాలో కూడా ఛాన్స్ దొరకడం కష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేల చూపు జనసేన మీద నిలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
పవన్ పార్టీకి అనుకూల కుల సమీకరణాలు ఉన్న నియోజకవర్గాల్లో, పవన్ సామాజికవర్గానికే చెందిన నేతలు.. జనసేనలోకి చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి ఈ తరహా వలసలు ఉంటాయా? అంటే.. కొంతవరకూ ఉండవచ్చని, అయితే అధికార టీడీపీ నుంచినే ఇవి ఎక్కువగా ఉండబోతున్నాయని, అందుకు సాక్ష్యం రాబోయే రోజులే అని క్షేత్రస్థాయి పరిశీలకులు అంటున్నారు.