రాష్ట్రంలోని సినీఫీల్డ్ లో అత్యధికులు వైసిపికే మద్దతు పలుకుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి. మామూలుగా అయితే సినీఫీల్డ్ మొత్తం అధికారంలో ఎవరుంటే వారికే మద్దతుగా నిలుస్తుంటుంది. దశాబ్దాల సినీ పరిశ్రమ చరిత్రలో ఎప్పుడు చూసినా ఈ విషయమే కనబడుతుంది. అంతెందుకు పొరుగునున్న తెలంగాణాలో చూసిన ఆ విషయం స్పష్టమైపోతుంది. టిడిపి పెట్టినప్పటి నుండి చూసినా సినీ పరిశ్రమలోని అత్యధికులు తెలుగుదేశంకే మద్దతుగా నిలిచారు. అంతెందుకు ఇపుడు కూడా అశ్వినీదత్, మురళీమోహన్, మాగంటి బాబు లాంటి పలువురు ప్రముఖులు టిడిపిలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఏపిలో మాత్రం అధికార తెలుగుదేశంపార్టీని కాదని ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారో అర్ధం కావటం లేదు.
చంద్రబాబు ఓటమి ఖాయమా ?
ఇంతకీ విషయం ఏమిటంటే, పశ్చిమగోదావరి జిల్లా మంతెపూడి క్రాస్ వద్ద సినీ నటుడు పృధ్వి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిసారు. సుమారు నాలుగు కిలోమీటర్లు పాదయాత్రలో జగన్ తో పాటు నడిచారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగనే అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పారు. 40 ఏళ్ళ వయస్సు ముందు 40 ఏళ్ళ అనుభవం తలవంచక తప్పదని సెటైర్ వేశారు. తాను జగన్ కు మద్దతు పలికినంత మాత్రాన సినీ పరిశ్రమలో ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదన్నారు. చంద్రబాబు నచ్చిన వారు ఆయనకు, జగన్ అంటే ఇష్టపడ్డ వారు వైసిపికి మద్దతు పలటంలో తప్పేమీ లేదన్నారు.
త్వరలో వైసిపిలోకి మరింతమంది ప్రముఖులు
తాను, పోసాని కాదని రాబోయే రోజుల్లో మరింతమంది సినీ ప్రముఖులు జగన్ కు మద్దతు పలకనున్నట్లు చెప్పారు. పృధ్వి మాటలు విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. సహజంగా అధికారానికి దగ్గరగా ఉండాలని కోరుకునే సినీ పరిశ్రమ పెద్దలు ప్రతిపక్షానికి ఎందుకు దగ్గరవ్వాలని చూస్తున్నారో అర్ధం కావటం లేదు. బహుశా వచ్చే ఎన్నికల్లో వైసిపినే అధికారంలోకి వస్తుందని సిని పరిశ్రమకు కచ్చితమైన అంచనాలేమైనా ఉన్నాయో తెలీటం లేదు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పప్పులుడకవని చెబుతూనే అవినీతితో నిండిపోయిన చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవటం ఖాయమని కచ్చితంగా చెబుతుండటం గమనార్హం.