మంత్రి అఖిలప్రియకు చంద్రబాబునాయుడు షాకిచ్చారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంత్రి అఖల తన వివాహం పనుల్లో బిజిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఆళ్ళగడ్డ, నంద్యాలలో మంత్రికి బద్ద శతృవైన సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి తో భేటీ అవ్వటం కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది. మహానాడు కార్యక్రమానికి ముందు ఏవి సుబ్బారెడ్డికి సిఎం కార్యాలయం నుండి హటాత్తుగా కబురు వచ్చింది. వెంటనే విజయవాడకు వచ్చి కలవాలంటూ చంద్రబాబు కబురు చేశారు. దాంతో ఏవి కూడా ఆగమేఘాలపై విజయవాడలో వాలిపోయారు. ఎప్పుడైతే మంత్రికి ఈ విషయం తెలియగానే షాక్ కు గురయ్యారు.
చంద్రబాబుతో ఏవి భేటీ
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసమే మంత్రి-ఏవి మధ్య గొడవలవుతున్న విషయం తెలిసిందే. నిజానికి మంత్రి హోదాలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి అఖిలకు ఎటువంటి సమస్యా ఉండకూడదు. కానీ టిక్కెట్టు కోసం ఓ సీనియర్ నేతతో పోటీ పడుతున్నారంటే తెర వెనుక ఏవికి కచ్చితంగా గట్టి మద్దతు లేకుండా సాధ్యం కాదు. దానికి తగ్గట్లే చంద్రబాబు కూడా ఇద్దరి మధ్య సర్దుబాటు చేయటానికి ప్రయత్నించినపుడల్లా ఎప్పుడు కూడా మంత్రికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఎవరికి ఇవ్వాలన్న విషయంపై సర్వే జరిపి నిర్ణయిస్తానని మాత్రమే చెప్పారు. దాంతో నియోజకవర్గంలో మంత్రికి వ్యతిరేకంగా ఏవి రెచ్చిపోతున్నారు.
అఖిలకు షాక్ తప్పదా ?
ఇక ప్రస్తుత విషయానికి వస్తే, చంద్రబాబుతో భేటీ జరిగిన తర్వాత ఏవిల మంచి జోష్ కనిపిస్తోందట. వచ్చే ఎన్నికల్లో పై రెండు నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక దానిలో తనకు టిక్కెట్టు ఇవ్వటానికి చంద్రబాబు తనకు హామీ ఇచ్చినట్లు తన మద్దతుదారులతో చెప్పుకుంటున్నారు. నంద్యాలలో ఏవికి టిక్కెట్టు ఇచ్చేది నిజమే అయితే మంత్రి సోదరుడుకి టిక్కెట్టు రాదు. ఒకవేళ ఆళ్ళగడ్డలోనే టిక్కెట్టు ఖాయమైతే మంత్రికే ఎసరు పెట్టినట్లు. ఏ పద్దతిలో చూసినా భూమా కుటుంబానికి షాక్ తప్పదు. దానికి తగ్గట్లుగానే జిల్లాలో కానీ రెండు నియోజకవర్గాల్లో కానీ మంత్రికి నేతల నుండి ఎటువంటి సహకారమూ అందటం లేదు. మంత్రి వైఖరి కూడా దానికి తగ్గట్లే ఉండటంతో ప్రతిరోజు గొడవలే. తాజాగా చంద్రబాబు-ఏవి మధ్య భేటీ జరగటంతో మొత్తానికి అఖిలకు మాత్రం షాక్ తప్పేట్లు లేదు.