దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు కచ్చితంగా భారతీయ జనతా పార్టీకి షాకిచ్చేదే. వెల్లడైన ఫలితాలు బిజెపియేతర పార్టీలకు, కూటములకు మంచి ఊపునిస్తుందనటంలో సందేహం అవసరమే లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని నాలుగు పార్లమెంటు, 11 అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరిగాయి. దాని తాలూకు కౌంటింగ్ గురువారం జరిగింది. ఆ ఫలితాలే బిజెపి తల బొప్పికట్టించగా ప్రతిపక్షాలకు మంచి ఊపునిస్తోంది. నాలుగు పార్లమెంటులో మూడు స్ధానాల్లో బిజెపికి ఓటమి తప్పలేదు. అదే విధంగా 11 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 9 చోట్ల బిజెపి ఓడిపోవటం గమనార్హం. వివిధ నియోజకవర్గాల్లో బిజెపి అధికారంలో ఉన్నా పార్టీ అభ్యర్ధులు ఓడిపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
3 సిట్టింగ్ స్ధానాలు కోల్పోయిన బిజెపి
లోక్ సభ ఉప ఎన్నికలకు సంబంధించి యూపిలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్గర్, భండారా-గోండియా, నాగాల్యాండ్ పార్లమెంటు స్ధానంలో బిజెపి ఓడిపోయింది. పై స్ధానాల్లో బిజెపికి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడటంతో బిజెపి పప్పులుడకలేదు. పైగా ఉప ఎన్నికలు జరిగిన నాలుగు లోక్ సభ స్ధానాలు కూడా బిజెపి సిట్టింగ్ స్ధానాలు కావటం గమనార్హం. అందులో మూడు చోట్ల బిజెపి ఓడిపోయింది. ప్రతిపక్షాలు గెలిచిన మూడు లోక్ సభ స్ధానాల్లో కైరానాలో ప్రతిపక్షాలు బలపరచిన ఆర్ఎల్డీ అభ్యర్ధి తబస్సుం అధికార బిజెపి అభ్యర్ధి మృగాంక సింగ్ పై గెలిచారు.
9 నియోజకవర్గాల్లో ఓడిపోయిన బిజెపి
ఇక, అసెంబ్లీ ఉప ఎన్నికల విషయం చూస్తే, ఇక్కడా బిజెపికి పెద్ద దెబ్బే తగిలింది. కర్నాటకలోని ఆర్ ఆర్ నగర్ నియోజకవర్గంలో, పాలన్ కడేగావ్-మహారాష్ట్రలో, మేఘాలయాలోని అంపతి లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. పంజాబ్ లోని షాకోట్ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధి అకాలీదల్ అభ్యర్ధిపై గెలిచారు. షాకోట్ అకాలీదళ్ సిట్టింగ్ స్ధానం కావటం గమనార్హం. ఉత్తరప్రదేశ్ లోని నూర్పూర్ నియోజకవర్గంలో బిజెపికి ఊహించని పరాభవం ఎదురైంది. సిట్టింగ్ స్ధానాన్ని ఎస్పీ అభ్యర్ధికి వదులుకోవాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లోని మహేస్ధలలో టిఎంసి అభ్యర్ధి గెలిచారు. కేరళలోని చెంగన్నూరు నియోజకవర్గంలో సిపిఎం విజయం సాధించింది. బీహార్ లోని జోకిహాట్ నియోజకవర్గంలో అధికార కూటమిలోని జెడియుకి పరాభవం తప్పలేదు. ఇక్కడ ఆర్జెడియు అభ్యర్ధి గెలిచారు. ఇక, జార్ఖండ్ లోని గోమియా స్ధానంలో బిజెపి అభ్యర్ధి, సిలీ స్దానంలో జెఎంఎం అభ్యర్ధులు గెలిచారు. ఉత్తరాఖండ్ లోని థరేలీలో బిజెపి గెలిచింది. అంటే ఉప ఎన్నికలు జరిగిన 11 అసెంబ్లీ స్ధానాలకు గాను కేవలం రెండు చోట్ల మాత్రమే బిజెపి గెలిచింది.
ఐకమత్యమే గెలిపించింది
మొత్తం 4 పార్లమెంటు, 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధికా స్ధానాల్లో బిజెపియేతర పార్టీలే గెలిచాయి. అందుకు ప్రధాన కారణం ఐకమత్యమే. బిజెపి అభ్యర్ధులకు ధీటుగా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్ధులను రంగంలోకి దింపటమే కాకుండా ఎటువంటి గొడవలు లేకుండా ప్రచారాన్ని చేశాయి. అంతేకాకుండా ఎలక్షనీరింగ్ లో కూడా ఎటువంటి పొరబాట్లు జరగకుండా చూసుకున్నాయి. దాని ఫలితంగానే దాదాపు అన్నీ సీట్లు గెలుచుకున్నాయి. అంటే, బిజెపియేతర పార్టీలు గనుక ఉమ్మడిగా అభ్యర్ధిని నిలబెట్టి సింసియర్ గా పోటీ కష్టపడితే బిజెపిని ఓడించటం కష్టమేమీ కాదని ఈ ఉప ఎన్నికలు నిరూపించాయనే అనుకోవాలి. అయితే అంతటి సింసియారిటీ ప్రతీ ఎన్నికలోనూ బిజెపియేతర పార్టీల్లో సాధ్యమేనా అన్నదే ప్రశ్న.