ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే సమయముంది. అన్ని రాజకీయ పార్టీలూ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారపక్షాన్ని దించి.. తాము ఎలాగైనా గద్దెనెక్కేందుకు వ్యూహ ప్రతివ్యూహాలను రెడీ చేస్తున్నాయి. అయితే ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు అధికార పార్టీ మరిన్ని ఎత్తుగడలు వేస్తోంది. ఇటీవలికాలంలో ఏపీ సీఎం చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ మథకాల మీద దృష్టి పెడుతోంది. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీల అమలు మీద దృష్టిపెడుతోంది. ఇప్పుడు నిరుద్యోగ భృతి అనే అస్త్రాన్ని బయటకు తీసింది. నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయలు భృతిగా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చందబ్రాబు ప్రకటించారు. ఇప్పుడు దాని అమలుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా ఈ అంశంమీద అధ్యయం చేసి కొన్ని విధివిధానాలు ఖరారు. ఒకే ఇంట్లో ఎంతమందికైనా నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. కేవలం నిరుద్యోగ భృతిని ఇవ్వడమే కాదు.. వారి నైపుణ్యాలు సానబెట్టేందుకు ట్రైనింగ్ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు.. వారు గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి లేదా ఇతరత్రా సేవలు అందించేలా ప్రోత్సహించి దానికి ఇన్సింటివ్స్ ఇస్తామని మంత్రి లోకేష్ చెబుతున్నారు.
నిరుద్యోగులకు సంబంధించిన డేటాను పక్కాగా నిర్వహించడంతో పాటు.. దేశంలో ఉద్యోగ నియమకాలు చేపట్టే అన్ని సంస్థలకు ఆ డేటాను అందుబాటులో ఉంచి.. వారు ఉద్యోగాలు పొందేలా చూస్తామంటున్నారు మంత్రి. ఈ పథకం కోసం భారీగా నిధులు అవసరమని.. అయినా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వెనకడుగు వేయదని హామీ ఇస్తున్నారు. ఈ పథకం కోసం ఐర్లండ్, నెదర్లాండ్, డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, గ్రీస్, జర్మనీ, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఇటలీ, యూఎస్, మలేషియా తదితర దేశాల్లో విధానాలు అధ్యయనం చేశారు. భారీకసరత్తు తర్వాతే ఈ విషయాన్ని ప్రటకించారు.
నిజమైన లబ్ధిదారులందరికీ ఈ పథకం అందేలా చూస్తామన్నారు యువజన, క్రీడల శాఖ మంత్రి మంత్రి కొల్లు రవీంద్ర. భవిష్యత్తులో మున్ముందు ఈ పథకం అవసరం లేకుండా చూస్తామని.. అంటే రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. భారతదేశంలో గతంలో కొన్ని ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేశాయి. హర్యానా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పంజాబ్, బీహార్, యూపీ.. చాలా చోట్ల 120, 200 ఇలానే ఇచ్చారు. యూపీలో 1000 పెట్టినా 6 నెలల తర్వాత ఎత్తేశారు. అయితే మన దగ్గర పరిస్థితి ఏమిటా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో అనుమానపడాల్సింది ఏమీ లేదని తమ దగ్గర డేటా పక్కాగా ఉందని కాబట్టి పథకం విజయవంతం అవుతుందని లోకేష్ చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రన్న బీమా పథకం మూడో సంవత్సరం వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అమలుకు సహరిస్తున్న అందర్నీ పేరు పేరునా అభినందించారు. పాదయాత్ర సమయంలో తాను చూసిన కొన్ని సంఘటల నుంచి ప్రేరణ పొందే తాను ఈ పథకానికి శ్రీకారం చుట్టానని.. చంద్రబాబు పేర్కొన్నారు. డ్వాక్రాసంఘాల పనితీరు బాగుండటంతో వారికే ఈ కార్యక్రమాన్ని అప్పగించామన్నారు. బాధల్లో ఉన్నవారికి బీమా సొమ్ము అందించడం ఒక్కరోజు అల్యసమైనా ఒప్పుకునేది లేదని సీఎం హెచ్చరించారు. చంద్రన్న బీమా పథకం ద్వారా లబ్ధిపొందిన ఇద్దరు మహిళలతో ముఖ్యమంత్రి మచ్చటించారు. వారి నుంచి తెలుసుకున్న విషయాలు తనకు చాలా తృప్తినిచ్చిందన్నారు. ఈ పథకాన్ని ఈ ఏడాది మరింత పెద్దఎత్తున్న అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
మరోవైపు పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. తాజాగా 50 వేల ఇళ్ల నిర్మాణానికి సంబధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి రాష్ట్రం కూడా తన వాటాను విడుదల చేస్తే.. 50 వేల ఇళ్ల నిర్మాణానికి రూట్ క్లియర్ అయిపోతుంది. ప్రభుత్వం దీని మీద కూడా దృష్టిపెట్టింది. వచ్చే ఆరేళ్లలో భారీగా పేదల గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం తరఫున వచ్చే తొమ్మిది నెలల పాటు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అములుకానున్న సంగతి స్పష్టంగా అర్ధమైపోతోంది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికే.! ఇందులో ఎవరికీ ఏమాత్రం సందేహం లేదు..!! మరి ఈ కార్యక్రమాలు ఏమేరకు లబ్దిచేకూర్చుతాయో వేచి చూడాలి.