రానున్న పంచాయితీ ఎన్నికలను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గ్రామస్ధాయి నుండి పార్టీని పటిష్టం చేసే ఉద్దేశ్యంతోనే త్వరలో జరుగుతాయనుకుంటున్న పంచాయితీ ఎన్నికలను బేస్ గా ఉపయోగించుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. జనసేనను ఏర్పాటు చేసి ఐదేళ్ళయినా ఇప్పటికీ పార్టీకి రంగు, రూచి, రూపు ఒక్క పవన్ మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీలో కీలక నేతల పేర్లు చెప్పుకోవాలంటే మొదటి పదిమందికి పది పేర్లు పవన్ కల్యాణ్ మాత్రమే కనబడుతుంది. ఇంతకాలం అలా గడచిపోయింది కానీ ముందు ముందు సాధ్యం కాదు. ఎందుకంటే, రాబోయేదంతా ఎన్నికల కాలమే కాబట్టి. రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగిపోతున్న సమయంలో కూడా పార్టీలో మొత్తం తానొక్కడే అన్నట్లుగా ఉంటే సాధ్యం కాదు. అందుకే పార్టీని గ్రామస్ధాయి నుండి బలోపేతం చేయాలని నిర్ణయించారు. అందుకు త్వరలో వస్తాయని అనుకుంటున్న పంచాయితీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని అనుకున్నారు.
హటాత్తుగా పర్యటనలు ఎందుకు ?
ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం ఉండగానే హటాత్తుగా పవన్ ఎందుకు రాష్ట్రంలో పర్యటనలు మొదలుపెట్టినట్లు ? ఇదే విషయాన్ని పార్టీలోని కీలక నేతలతో ప్రస్తావించగా పంచాయితీ ఎన్నికల విషయాన్ని చెప్పారు. పార్టీని ముందుగా గ్రామస్ధాయి నుండి బలోపేతం చేయాలని పవన్ అనుకున్నారు. అందులో భాగంగానే పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ఎలాగూ పార్టీ పరంగా జరగవు. కాబట్టి గ్రామస్ధాయిలో జరిగే పంచాయితీ ఎన్నికల్లో మంచి వ్యక్తులను రంగంలోకి దింపితే ముందుగా గ్రామస్ధాయిలో పార్టీకి పట్టు దొరుకినట్లవుతుందన్నది పవన్ ప్లాన్ గా చెప్పారు. ఎన్నికలు అయిపోగానే తర్వాత మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. పంచాయితీ ఎన్నికల తర్వత ఎలాగూ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత మున్సిపాలిటీలకూ ఎన్నికలు పెట్టాల్సిందే. తర్వాతెప్పుడో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా క్రింది స్ధాయి నుండి పార్టీని బలోపేతం చేసుకుంటూ, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా ప్రభావం చూపగలిగితే సాధారణ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవటం పెద్ద కష్టం కాదన్నది పవన్ భావన.
పంచాయితీల కొసమే పర్యటనలు
షెడ్యూల్ ప్రకారమైతే వచ్చే ఆగష్టు నెలలో పంచాయితీ ఎన్నికలు జరగాలి. జరుగుతాయా లేదా అన్నది ప్రభుత్వం మీద ఆధార పడుంటుంది. జరిగినా జరగకపోయినా ఎన్నికలకైతే సిద్ధంగా ఉంటే ఎప్పుడు జరిగినా ఇబ్బంది ఉండదని పవన్ అనుకున్నారు. అందుకనే హటాత్తుగా పర్యటనలు మొదలుపెట్టేశారు. అదికూడా ఉత్తరాంధ్ర నుండే మొదలుపెట్టటం వ్యూహాత్మకమే. ఎందుకంటే, ఇప్పటికే ఉత్తరాంధ్రలో పవన్ అనేక సార్లు వివిధ సమస్యల పరిష్కారం కోసం పర్యటించున్నారు. కాబట్టే ఇపుడు కూడా తన పర్యటనను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుండే మొదలుపెట్టారు.