వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపు ఎంఎల్ఏలే టార్గెట్ గా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. మిగిలిన నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు ఫిరాయింపు ఎంఎల్ఏల నియోకవర్గాలు మాత్రం ఒక ఎత్తుగా జగన్ ప్లాన్ చేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 67 మంది ఎంఎల్ఏల్లో 23 మంది టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. వెళ్ళిన వారు వెళ్ళినట్లు ఊరికే ఉండకుండా జగన్ ను అమ్మనాబూతులు తిడుతున్నారు. అందుకనే ఫిరాయింపుల్లో నలుగురికి చంద్రబాబునాయుడు ఏకంగా మంత్రిపదవులు సైతం కట్టబెట్టారు. జగన్ ను తిట్టినందుకు, తిట్టేటందుకే ఆదినారాయణరెడ్డి, అమరనాధరెడ్డి, భూమా అఖిలప్రియ, సుజయ కృష్ణరంగారావులకు మంత్రిపదవులిచ్చారు. దాంతో వారు రెచ్చిపోతున్నారు. వీళ్ళను చూసి జలీల్ ఖాన్ లాంటి మిగిలిన ఫిరాయింపు ఎంఎల్ఏలు కూడా అదే బాటలో నడుస్తున్నారు.
రెచ్చిపోతున్న ఫిరాయింపు మంత్రులు
ఎప్పుడైతే పార్టీ ఫిరాయించిన తర్వాత తననే టార్గెట్ గా చేసుకుని ఫిరాయింపులు రెచ్చిపోతున్నారో వారందరిపై జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆళ్ళగడ్డ, నంద్యాల, గిద్దలూరు, జగ్గంపేట, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, కోడుమూరు, పాడేరు, పలమనేరు, అద్దంకి లాంటి ఫిరాయింపు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను రంగంలోరి దింపేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఆ బాధ్యతను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డికి అప్పగించారట. అదే సందర్భంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికె) కు కూడా ఇదే విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. అందుకనే ప్రశాంత్ కిషోర్ ఒకటికి రెండు సార్లు ఫిరాయింపు నియోజకవర్గాల్లో సర్వేలు జరిపిస్తున్నారు.
మూడు రకాల సర్వేలు
జరుపుతున్న సర్వేల్లో మూడు రకాలున్నాయట. మొదటిదేమో ఫిరాయింపు ఎంఎల్ఏలపై జనాలభిప్రాయాలు. రెండోదేమో ప్రభుత్వంపై జనాల్లోని వ్యతిరేకత. ఇక మూడోదేమో ఆయా నియోజకవర్గాల్లో వైసిపి తరపున ఎవరైతే గట్టి అభ్యర్ధి అవుతారో అన్న జనాల అభిప్రాయమట. మొత్తం మీద పై మూడు అంశాలపైనా పికె బృందం ఎప్పటికప్పుడు జగన్ కు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారట. అందులో భాగంగానే తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జ్యోతుల చంటాబ్బాయ్ ను జగన్ ఈమధ్యే వైసిపిలోకి చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేటలో ఫిరాయింపు ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రూపై వైసిపి తరపున చంటబ్బాయ్ నే రంగంలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారట. చంటబ్బాయ్ కూడా గతంలో టిడిపి తరపున పోటీ చేసి ఓడిపోయారు. రెండు ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గంలో గట్టి నేతగానే చెలామణి అవుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే ఫార్ములాను జగన్ అనుసరించే అవకాశం ఉంది.
అభ్యర్ధుల ఎంపికే కీలకం
వచ్చే ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేయబోయే అభ్యర్ధుల ఎంపికే కీలకంగా మారనుంది. పోయిన ఎన్నికల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటే చాలని సీనియర్ నేతలు జగన్ కు సలహా ఇస్తున్నారు. ప్రభుత్వంపై ఎటూ జనాల్లో వ్యతిరేకత ఎక్కువగానే ఉందని వైసిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి. దానికితోడు పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడిన బిజెపి, జనసేనలు వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా మారాయి. దాంతో పోయినసారి చంద్రబాబుకు మద్దతుగా నిలబడిన అంశాల్లో వచ్చే ఎన్నికల్లో చాలా వరకూ ఎదురుతిరిగే అవకాశాలున్నాయి. అటువంటి నేపధ్యంలో వైసిపి తరపన పోటీ చేయబోయే అభ్యర్ధులను గనుక గట్టి వారిని రంగంలోకి దింపితే సరిపోతుందన్నది జగన్ భావన. అందుకే ఫిరాయింపు నియోజకవర్గాల్లో ముందు గట్టి అభ్యర్ధులను రంగంలోకి దింపితే 23 నియోజకవర్గాలు వైసిపి ఖాతాలో పడినట్లే అని జగన్ అనుకుంటున్నారు.